హంసవాహనంపై విహరిస్తున్న రామచంద్రుడు
చక్రస్నానం నిర్వహిస్తున్న వేదపండితులు
వాల్మీకిపురం: వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణతో ముగిశాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కోలిపి శుద్ధి, తోమాలసేవ, కొలువు, పంచాగశ్రవణం, అర్చన, బలి, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 7గంటలకు వసంతోత్సవం అనంతరం స్వామివారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. సీతారామలక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం జరిపారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8గంటలకు వాహన మండపంలో సీతారామలక్ష్మణులను హంసవాహనంపై కొలువదీర్చారు. స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 10గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీ పట్టాభిరామస్వామి శ్రీ పరాభవనామ సంవత్సర సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, సిబ్బంది నాగరాజ, భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలు


