కడప రూరల్: తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా జిల్లా వ్యాప్తంగా మరో మారు ఎన్టీఆర్ వైద్య సేవ ( ఆరోగ్యశ్రీ ) ఉచిత వైద్య సేవలను ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు బుధవారం నుంచి నిలుపుదల చేశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో మరోమారు ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేయడంతో వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు పడ్డారు. తొలిరోజు చాలా వరకు ఆసుపత్రులు వైద్య సేవలను నిలుపుదల చేసి సమ్మెలో పాల్గొన్నా యి. వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన పేదలు వైద్య మిత్రులను సంప్రదించగా.. వైద్య సేవలను నిలుపుదల చేశారు మరొక ఆసుపత్రికి లేదా రిమ్స్కు వెళ్లాలంటూ సూచించారు. దీంతో వచ్చిన రోగులు అసౌకర్యానికి.. ఇబ్బందులకు గురయ్యారు. ఉచిత వైద్యానికి ఎప్పుడు ఆటంకాలు లేవని... ఈ ప్రభుత్వంలోనే సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని పలువురు వాపోయారు.
ఆసుపత్రులను నిర్వహించలేక..
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 110 కి పైగా ఆసుపత్రులు ఉన్నాయి. అందులో 42 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపుగా మొత్తం రూ 130 కోట్లకు పైగా బకాయిలను చెల్లించాలి. ఆసుపత్రులను నిర్వహించలేని పరిస్థితులలో ఉన్న యాజమాన్యాలు తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి.
‘ఎన్టీఆర్ వైద్య సేవ ’ (ఆరోగ్యశ్రీ ) కు గడ్డుకాలం దాపురించింది. టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత వైద్యం పథకంపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేశా యి ఫలితంగా పేదలకు ఉచిత వైద్యం గగనమైంది.
ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు అందని బిల్లులు
’ఆషా’ పిలుపుమేరకు వైద్య సేవలు బంద్
ఉచిత వైద్యానికి పేదల ఇబ్బందులు


