
రాజ్యాంగేతర శక్తి!
● ఈనెల 7న శనివారం అర్ధరాత్రి అనంతంపల్లె సింగిల్విండో మాజీ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డిపై పుల్లంపేటలో హత్యాయత్నం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు నిందితుల దాడి నుంచి ప్రాణాలు దక్కించుకున్నారు. వివాహానికి వెళ్లిన సుదర్శన్రెడ్డి ఇంటికి వస్తారని తెలుసుకొని పోలీసుస్టేషన్లో సమీపంలో మాటువేసి ఉన్న దుండగులకు అనూహ్యంగా చిక్కారు. పిడిబాకుతో పొడుస్తుండగా పెనుగులాటలో జారుడు గాయాలు తగిలాయి. సుదర్శన్రెడ్డి చావు కేకలు విన్పించడంతో ఇరుగుపొరుగు వారు నిద్రలేచి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. ఈతతంగం మొత్తం పోలీసుస్టేషన్ ఎదుట చోటుచేసుకుంది.
● ఈనెల 13న శుక్రవారం సాయంత్రం ఓబులవారిపల్లె మండలం తల్లంవారిపల్లెలో భూవివాదంలో వాగ్వాదం చోటుచేసుకుంది. భూముల్లోకి వెళ్లే దారికి అడ్డంగా బీజేపీ నేత రాజగోపాల్రెడ్డి ముళ్ల కంచె వేశారు. ఆపై మద్యంమత్తులో రెచ్చిపోయి పరుషపదజాలంతో దూషణలకు దిగారు. దీంతో చలించిపోయిన గ్రామస్తులు ప్రతిఘటించారు. ఆత్మాభిమానంతో రాజగోపాల్రెడ్డిపై తిరగబడ్డారు. పరస్పర దాడుల్లో రాజగోపాల్రెడ్డి గాయాలయ్యాయి.
సాక్షి టాస్క్ఫోర్స్: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో వారంలోపు వేర్వేరుగా చోటుచేసుకున్న రెండు ఘటనల్లో పోలీసుల ట్రీట్మెంట్ ఆక్షేపణీయం. ఘర్షణ తలెత్తితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం పరస్పర వైరుధ్యాన్ని ప్రదర్శించింది. పుల్లంపేట పోలీసుస్టేషన్లోనే మాటువేసి అనంతంపల్లె మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సుదర్శనరెడ్డిని అంతమొందించాలనే చర్యలకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై 324 సెక్షన్లపెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి గౌరవంగా ఇళ్లుకు పంపించారు. భూముల్లోకి వెళ్లేందుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి, దుర్భాషలాడుతూ వీరంగం చేసిన రాజగోపాల్రెడ్డిపై దాడి ఘటనలో నాన్బెయిల్బుల్ సెక్షన్లతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతటితో సరిపెట్టక పోలీసుస్టేషన్లు మార్చుతూ చిట్వేల్కు తీసుకెళ్లి రాత్రంతా భారీగా కోటింగ్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన భూమిక పోషించింది అక్కడి రాజ్యాంగేతర శక్తి. అమ్మగా పిలువబడే రాజ్యాంగేతర శక్తి స్వయంగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి సుదర్శన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని పట్టుబట్టింది. కాదు కూడదు అని పోలీసులు బతిమాలి కొట్లాటగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రాజగోపాల్రెడ్డిపై దాడి చేసిన కేసులో అప్పటికప్పుడు నిందితులను పట్టుకురావడం, ఆపై కోటింగ్ ఇవ్వడం, హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఒకదాని వెంట ఒకటి క్రమంగా తెరపైకి వచ్చాయి.
● అమ్మ అండతో రెచ్చిపోతున్న కూటమి కార్యకర్తలు
● ఆ నియోజకవర్గంలో డమ్మీగా మారిన పోలీసు యంత్రాంగం
● ప్రతి విషయంలో జోక్యం...అమ్మ ఫోన్ వస్తే జడుసుకుంటున్న అధికారులు
● చెప్పింది చెప్పినట్లు ఆచరిస్తేనే విధి నిర్వహణలో కొనసాగింపు
● చట్టం, నిబంధనలంటే ఒప్పుకునేది లేదు...బదిలీనే బహుమానం
● మండలానికో ఇన్చార్జి...ఫైనల్ తీర్పు అమ్మదే...
ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేకోడూరు నియోజకవర్గంలో సూపర్ బాస్ చెప్పిందే వేదంగా నడుస్తోంది. ఒకే కుటుంబ సభ్యులు మండలానికి ఒక ఇన్చార్జి ఉన్నప్పటికీ ఫైనల్ తీర్పు అమ్మ చెప్పినట్లు చేయాల్సిందే. అమ్మ చెప్పిందంటే అయ్యా చెప్పినా నిరుపయోగమే. అక్కడి ప్రజాప్రతినిధిని కాదని రాజ్యాంగేతర శక్తి మొత్తం వ్యవ హారం నడిపిస్తోన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు అనేక ఉదాహరణలు సైతం నియోజకవర్గ ప్రజలు కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చట్టం.. నిబంధనలంటే అక్కడి విధుల నుంచి జారుకోవాల్సిందే. అలాంటి దుస్థితి రైల్వేకోడూరులో నియోజకవర్గంలో ఉండిపోయింది. ఆయా మండల ఇన్చార్జిలుగా ఉన్న కుటుంబ సభ్యులు అధికారులకు సిఫార్సు చేసినా అమ్మ నుంచి ఫోన్కాల్ వచ్చిందంటే అదే ఫైనల్. ఆ తీర్పునకు అనుగుణంగా అధికారుల చర్యలు ఉండిపోవాల్సిందే. చెప్పిన మాట చెప్పినట్లుగా ఆచరించకపోతే వెంటనే ఆ అధికారికి బదిలీ బహుమానంగా దక్కనుంది. అలాంటి పరిస్థితిని ఓ తహసీల్దార్ , మరో ఎస్ఐ ఎదుర్కొన్నా రు. బదిలీపై విధుల్లో చేరిన తహసీల్దార్కు 9నెలల్లోనే మళ్లీ బదిలీ బహుమానంగా దక్కింది. ఓ ఎస్ఐకి కూడా అదే పరిస్థితి తలెత్తింది. దీంతో అధికారులు రాజ్యాంగేతర శక్తి నుంచి ఫోన్ కాల్ వస్తే గంగిరెద్దులా తలూపాల్సిందే, ఆచరణలో చూపెట్టాల్సిందేనని విశ్లేషకులు సైతం వాపోతున్నారు.