కడప అర్బన్ : దివ్యాంగుల పింఛన్లలో కోత విధించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వైకల్య శాతం ధ్రువీకరణపై రీవెరిఫికేషన్ (పునఃపరిశీలన) చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహించి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కడపలో నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో కొన్ని నెలలుగా చేపడుతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లోగా ఈ గడువు కూడా ముగియనుంది. తమ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఈఎన్టీ, ఆర్థోఫెడిక్, మానసిక దివ్యాంగులు, పక్షవాతం లాంటి కేటగిరీలలో వైద్యులు లేని పక్షంలో.. రిమ్స్కు వస్తున్నారు.
పింఛన్ రద్దు అవుతుందేమోననే భయంతో..
సదరం శిబిరాలకు అర్హులైన దివ్యాంగులతోపాటు కొందరు అనర్హులు కూడా హాజరవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులు, అనర్హులు కూడా తమకు పింఛన్లు రద్దు కాకుండా చేసుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. నిక్కచ్చిగా వున్న దివ్యాంగులు ఎంతో కష్టపడి తమ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజల సహకారంతో రిమ్స్కు వస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్లోని కొందరు చిరుద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. వీరిని కొందరు దివ్యాంగులు ఆశ్రయిస్తున్నారు. అర్హులైన వారు తమకు మరల సర్టిఫికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనే అనుమానంతో దళారుల మాయలో పడుతున్నారు. మరి కొంత మంది అనర్హులైనప్పటికీ గతంలో ఫ్రెష్గా దివ్యాంగుల సర్టిఫికెట్లను తెచ్చుకునేందుకు తమ పరిధిలో నానా తంటాలు పడి ఎలాగోలా సర్టిఫికెట్ సాధించుకున్నారు. తాము సర్టిఫికెట్లను పొందినప్పటి నుంచి ప్రస్తుతం వరకు దివ్యాంగుల పెన్షన్ పొందుతూ ఉంటారు. అలాంటి వారిలో చాలా మంది కడప రిమ్స్ ఓపీకి రాగానే చిరుద్యోగులైన దళారులను ఆశ్రయిస్తున్నారు.
ఒక్కొక్కరి నుంచి 25 వేల దాకా వసూలు
తమ ప్రాంతంలోని దివ్యాంగులకు సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో కొందరు దళారులు.. రిమ్స్లోని ‘ఫలానా’ చిరుద్యోగుల దగ్గరికి వెళితే పని అయిపోతుందని తెలియజేస్తుంటారు. అలా రీ వెరిఫికేషన్లో ‘సక్సెస్’ పొందిన దివ్యాంగుడికి సదరు చిరుద్యోగి తమ ఫోన్ నంబర్ను ఇచ్చి.. తమ గ్రామ, మండల పరిధిలోని దివ్యాంగులను తమ దగ్గరికే పంపించాలని చెబుతుంటారు. వారి రెఫరెన్స్తో సంబంధిత దివ్యాంగులు మరలా చిరుద్యోగులను ఆశ్రయిస్తుంటారు. ఒక్కో వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం రూ.15 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆ విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జూనియర్ అసిస్టెంట్, అటెండర్తోపాటు కొందరి చిరుద్యోగుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మరో జూనియర్ అసిస్టెంట్ ప్రమే యం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు డాక్టర్లతో కుమ్మకై ్క
ఏదిఏమైనా ఎవరైనా సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో జాబితా ప్రదర్శించిన తరువాత ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ ప్రక్రియలో కొందరు డాక్టర్లతో.. అక్రమార్జనకు అలవాటు పడిన చిరుద్యోగులు కుమ్మకై ్క ‘రీ వెరిఫికేషన్’ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రీ వెరిఫికేషన్లో అక్రమార్జన చిరుద్యోగులు తమకు సహాయం చేసే కొందరు వైద్యులు చెప్పిన ఫోన్ పే నంబర్లకు ఎంచక్కా డబ్బులకు వేసేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే సర్టిఫికెట్ చేద్దామని, మానవతా దృక్పథంతో సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో వ్యవహరించే వారిని కూడా చిరుద్యోగులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం వచ్చింది.
సమగ్ర విచారణ
ఈ వ్యవహారంపై ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యను సాక్షి వివరణ కోరగా.. సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలనలో అవకతవకలు
రిమ్స్ సదరం శిబిరంలో చేతివాటం
కొందరు వైద్యులు, ఉద్యోగుల ప్రమేయం
విలవిలలాడుతున్న దివ్యాంగులు
దళారీ వల.. సర్టిఫికెట్లకు వెల
దళారీ వల.. సర్టిఫికెట్లకు వెల