
రక్తదానం చేద్దాం... ప్రాణాలు నిలుపుదాం
కడప కల్చరల్ : ప్రస్తుత సమాజంలో బాధితులకు రక్తం అవసరం ఎంతైనా ఉందని, మిగతా వారికి కూడా అవసరమున్నసమయంలో స్పందించాలని జిల్లా రెవెన్యూ అధికారి, రెడ్ క్రాస్ సొసైటీ స్పెషలాఫీసర్ విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఏపీ సాక్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లాలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కడప నగరంలోని మట్టి పెద్దపులి సర్కిల్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయడంతో పాటు మన చుట్టూ ఉన్నవారితో కూడా రక్తదానం చేయించాలన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న 18 నుంచి 60 సంవత్సరాలలోపు గలవార, 45 కేజీల పైన బరువు వున్న వారు రక్తదానం చేయవచ్చన్నారు. అంతేకాకుండా రక్తదానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, రెడ్ క్రాస్ జిల్లా సెక్రెటరీ ఏ.సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఫ్యాక్టరీలు, కళాశాలలు ఉన్నాయని, ఆయా యాజమాన్యాల వారు వారి సిబ్బంది, విద్యార్థులకు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి సహకరించాలని కోరారు. అనంతరం జీవిత కాలంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు, 2024– 25 ఆర్థిక సంవత్సరంలో రెడ్ క్రాస్ సొసైటీకి సహకరించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన కళాశాలలకు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవో సంస్థలకు మెమొంటోలు, ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం రక్తదాతలను శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ ఎస్ రవిబాబు, ఏపీ సాక్స్ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి భాస్కర్, రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ యశస్విని రెడ్డి, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సుధాకర్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు