పోరుమామిళ్ల : ఇటీవల అత్యంత చర్చనీయాంశంగా మారిన కాశినాయన జ్యోతి క్షేత్రంలో నిర్మాణాల కూల్చివేత గురించి బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీసుకెళ్లి వివరించారు. ఆయన వెంట నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, బి.కోడూరు మాజీ జెడ్పీటీసీ, మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాళ్లపల్లె నరసింహులు, కాశినాయన మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, గంటా రమణారెడ్డి, మేరెడ్డి రమణారెడ్డి తదితరులున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కాశినాయన క్షేత్రంలో జరిగిన అభివృద్ధి, ఆగిపోయిన ఆలయ పనులు వివరిస్తూ.. హఠాత్తుగా ఫారెస్టు అధికారులు, పోలీసులు అక్కడ నిర్మాణాలు అడ్డంగా కూలగొట్టడం, భక్తుల మనోభావాలు దెబ్బతినడం తదితర అంశాలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాజీ సీఎంకు వివరించారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి త్వరలో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలసి మాట్లాడతానని చెప్పినట్లు డీసీ గోవిందరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ కూడా కాశినాయన క్షేత్రాన్ని సందర్శిస్తానని చెప్పారన్నారు.