పెనుగొండ: ఆచంట నక్కల డ్రెయిన్లో మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలని నక్కల డ్రెయిన్ పరివాహక ప్రాంత రైతులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. మార్టేరులో నిర్వహించిన కిసాన్ మేళాలో మట్టి మాఫియాపై రైతులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. నక్కల కాలువ పడమర గట్టును ఆనుకుని 150 అడుగుల పొడవున, 50 అడుగుల వెడల్పులో 15 అడుగుల లోతున మట్టి అక్రమంగా తరలించుకుపోయారన్నారు. దీంతో రైతులు సమష్టిగా అడ్డుకుని మట్టిని అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను, జేసీబీపైనా అఽధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు రోజుల్లో సుమారు 100 వాహనాల్లో మట్టిని తరలించారని తెలిపారు. దీంతో భారీ గోతులు ఏర్పడి దాళ్వా ధాన్యం రవాణా కష్ట సాధ్యంగా మారుతుందని, వర్షాకాలంలో గట్టు బలహీన పడి పరివాహక వరిచేలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని రైతులు మంత్రి అచ్చెనాయుడిని కోరారు.


