ఏడేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో దారుణం
పెనుగొండ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మహిళలు, బాలికలపై లైంగిక దాడులు నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి 70 ఏళ్ల వృద్ఢుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక నొప్పి అంటూ విలపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లి ఆరా తీయడంతో వ్యవహారం బట్టబయలైంది.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ గ్రామంలో వెలగన వెంకటస్వామి (70) సోడా షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారం చేసుకునే దంపతుల ఏడేళ్ల కుమార్తె ఎల్కేజీ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాలిక సోడా దుకాణానికి వెళ్లడంతో వెంకటస్వామి చాక్లెట్ ఇస్తానంటూ లోపలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇంటికి వెళ్లిన బాలిక రాత్రి సమయంలో అమ్మానొప్పి అంటూ విలపిస్తూ విషయాన్ని తల్లికి తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసాపురం ఇన్చార్జి డీఎస్పీ రఘవీర్ విష్ణు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట ఎస్ఐ కె.వెంకటరమణ ఘటనపై విచారిస్తున్నారు. నిందితుడు వెలగల వెంకటస్వామి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.


