రూ.10 లక్షలు, బంగారం తీసుకుని మోసం చేశాడు
గంజాయి స్వీట్స్ తినిపించి.. మత్తులో టార్చర్ చేసేవాడు
వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన భీమవరం గునుపూడికి చెందిన విజయలక్ష్మి
సోషల్ మీడియాలో ఆ వీడియో హల్చల్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని, రూ.10 లక్షలు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసుకు ప్రతి కార్యక్రమానికి వెళ్లేదానినని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు.
నేను అంటే ఇష్టమని, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగాడన్నారు. నాకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని... సెట్ అవ్వదని చెప్పానన్నారు. తనకూ పెళ్లి అయ్యిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్ తో రెండేళ్లు కలిసి ఉన్నానని బాధితురాలు చెప్పారు.
ఈ క్రమంలో ఇల్లు కొంటున్నానని, ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పి రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని... తర్వాత నుంచి అతడి ప్రవర్తన మారి తనను ఇష్టం లేకుండా చూడటం, కొట్టడం, గంజాయి కలిపిన స్వీట్స్ పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తనను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక మా పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా మళ్లీ ఫోన్ చేయడంతోపాటు, మా అమ్మతో మాట్లాడి... తీసుకెళ్లి మరలా టార్చర్ చేశాడని వాపోయింది. ఓ సారి టార్చర్ చేసిన తర్వాత ఆస్పత్రిలో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆది నుంచి వివాదాస్పదుడే..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్నాయుడు(జేపీ) ఆది నుంచి వివాదాస్పద వ్యక్తి. ఆయనపై భూఆక్రమణలు, సివిల్ వివాదాలు, కొట్లాటలకు సంబంధించి కేసులున్నాయి. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించిన, తెలంగాణలో మత్స్యశాఖలో చేపల సాగు టెండర్ల విషయంలోనూ నకిలీ ధ్రువీకరణపత్రాలు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారని ఆరోపణలపైనా తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కిందట విచారణ నిర్వహించింది. తణుకు, భీమవరం, వీరవాసరంలోనూ ఆయనపై కేసులున్నాయి.


