ఏలూరు రైల్వేస్టేషన్లో హెల్ప్లైన్ ఏర్పాటు
ఏలూరు (టూటౌన్): యలమంచిలి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం జరిగిన టాటానగర్–ఎర్నాకులం రైలు ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి ఏలూరు రైల్వే స్టేషన్ నందు హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హెల్ప్లైన్ నెంబర్ 75693 05268 కు కాల్ చేసి ప్రమాద వివరాలు, ప్రయాణ వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 8న రైలు నెం.07460 కాకినాడ టౌన్–వికారాబాద్, 9, 11 తేదీల్లో రైలు నెం.07461 పార్వతీపురం–వికారాబాద్, 10న ట్రైన్ నెం.07462 పార్వతీపురం–వికారాబాద్, 12న ట్రైన్ నెం.07463 పార్వతీ పురం–కాకినాడ టౌన్ ప్రత్యేకరైళ్లు నడుపనున్నారు. అలాగే జనవరి 8న ట్రైన్ నెం.07464 సికింద్రాబాద్–పార్వతీపురం, 9న ట్రైన్ నెం.07465 పార్వతీపురం–సికింద్రాబాద్, 7, 9 తేదీల్లో ట్రైన్ నెం.07186 కాకినాడ టౌన్–వికారాబాద్, 8న ట్రైన్ నెం.07185 వికారాబాద్–కాకినాడ టౌన్, 10న ట్రైన్ నెం.07187 వికారాబాద్–కాకినాడ మధ్య ప్రత్యక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
భీమవరం: వచ్చే నెల 3వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరుగనున్న సౌత్జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి బి జాయ్కుమార్ ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడ వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూకే బ్యాడ్మింటన్ సెలక్షన్స్లో తమ విద్యార్థి జాయ్కుమార్ ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు అభినందించారు.
ఉండి: నిమ్మలపేటలో చోరీ జరిగింది. వివరాల ప్రకారం ఉండి నిమ్మలపేటకు చెందిన పేడ్డ రాము వ్యవసాయ కూలీ. అతడు కుటుంబంతో సహా గత కొంతకాలంగా ఇతర ప్రాంతాల్లో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఈ చోరీలో 4 కాసుల బంగారం, కొంత వెండి దోపిడీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఈ చోరీపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్.అగ్రహారం రాళ్ల సాహెబ్ల కాలనీ సమీపంలో సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం వీకర్స్ కాలనీకి చెందిన ఈగల గణేష్ (20) తాపీ పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో ఎల్.అగ్రహారం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించగా ఫ్యాన్ హుక్కు ఉరివేసుకుని ఉండటాన్ని బంధువులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా రూరల్ పోలీసులు తెలిపారు. మృతుని సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.
నరసాపురం రూరల్: బహిర్బూమికి వెళ్లిన దివ్యాంగుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై జి వాసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన కుక్కల భాస్కరరావు (45) బహిర్బూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో మునిగి మృతి చెందాడు. అతడికి భార్య, దత్తత కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పెన్షన్ ద్వారానే ఆయన కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. భాస్కరరావు భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


