
ఎంటీఎస్ టీచర్ల ఆక్రందన
ఏలూరు (ఆర్ఆర్పేట): గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీ అర్హులకు ఉపాధ్యాయులుగా మినిమం టైం స్కేల్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి ఆదుకుంది. జగన్ తీసుకున్న కీలక నిర్ణయంతో డీఎస్సీల్లో అర్హులైన మొత్తం 390 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి. కలగా మిగిలిపోతుందనుకున్న ఉద్యోగం రావడంతో వారు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పని సర్దుబాటు ప్రక్రియలో ఎంటీఎస్ టీచర్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో వీరిని సొంత మండలాల పరిధిలోనే చేయాల్సి ఉండగా సుమారు 140 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు మార్చారు. వీరిలో కొంతమందికి ఏడాది, మరికొంత మంది రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. 2008 డీఎస్సీ అర్హుల్లో సైతం కొంతమంది మరో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. పని సర్దుబాటు ప్రక్రియలో వీరిని చాలా దూరానికి బదిలీ చేయడంతో ఒక పక్క పిల్లల చదువులు, మరో పక్క వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం
ఆయా బాధ్యతలు నెరవేర్చలేక మానసికంగా కుంగిపోతున్న వారికి అన్నిటికీ మించి దీర్ఘకాలిక అనారోగ్యాలు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. దీంతో పాటు తమకు అలవాటులేని వాతావరణంలో పని చేయాల్సి రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. వాస్తవానికి ఈ నెల 20న ఎంటీఎస్ టీచర్ల బదిలీ జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో బదిలీలు వాయిదా వేశారు. కౌన్సిలింగ్ ఆదివారం చేపట్టనున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. ఈ బదిలీల్లో ముందుగా వృత్తిలో చేరిన 2008 డీఎస్సీ అర్హులను సీనియారిటీ జాబితాలో పైకి చేర్చి అనంతరం వృత్తిలో చేరిన 1998 డీఎస్సీ అర్హులను తరువాత వరుస క్రమంలో చేర్చారు. ఈ కారణంగా ఈ సారి బదిలీల్లో కూడా తమకు అన్యాయం జరుగుతుందని 1998 అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమను కనికరించాలని వేడుకోలు
మరో ఏడాది, రెండేళ్లలో పదవీ విరమణ చేసే తమను మళ్లీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు బదిలీలు చేస్తే తమకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని 1998 డీఎస్సీ అర్హులు వాపోతున్నారు. ఈ బదిలీల్లో సీనియారిటీ కంటే వయసు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని వయసు రీత్యా 60 ఏళ్లకు దగ్గరలో ఉన్న తమకు బదిలీల్లో సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యత కల్పించి కోరుకున్న ప్రాంతాల్లో పని చేసేలా చూడాలంటున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులు తమ కంటే చిన్న వారు కాబట్టి పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న తమకు సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
సొంత ఊళ్లకు
200 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం
ఈ సారి దగ్గర మండలాలకు
బదిలీ చేయాలని వేడుకోలు