
ఏలూరు శాయ్లో లైంగిక వేధింపులు
ఏలూరు టౌన్: ఏలూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారింది. తమను తీర్చిదిద్దాల్సిన గురువులే కీచకులుగా మారితే... తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటూ వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు భరించలేక స్పోర్ట్స్ అఽథారిటీ ఆఫ్ ఇండియాకు మహిళా క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారించారు.
అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఏర్పాటు చేసిన శాయ్ కేంద్రంలో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవడంతో వారంతా కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఏకంగా 10 మంది మహిళా క్రీడాకారిణులు శాయ్ నిర్వాహకులు, వెయింట్ లిఫ్టింగ్ కోచ్పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శాయ్ ఇన్చార్జ్తో పాటు వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ కోచ్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శాయ్లో అథ్లెటిక్స్లో బాలురు, బాలికలు తర్ఫీదు పొందుతూ ఉండగా, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బాలికలు అధికంగా ఉన్నారు. బాలికలకు శాయ్ హాస్టల్లోనే వసతి సౌకర్యాలు కల్పిస్తారని సమాచారం. బాలురకు అల్లూరి సీతారామరాజు స్టేడియంలోని గదుల్లో వసతి కల్పిస్తారు. ఈ నేపథ్యంలో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేయటంపై వారంతా శాయ్ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు.
బెంగుళూరు బృందం విచారణ
క్రీడాకారిణుల ఫిర్యాదుపై కేంద్రం శాయ్లోని ఇద్దరు సభ్యుల బృందం గత కొద్దిరోజులుగా రహస్య విచారణ చేపట్టి ఆరోపణలు వాస్తవమేని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో విచారణ అధికారులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించి దానిపై ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నట్లు టూటౌన్ సీఐ అశోక్కుమార్ స్పష్టం చేశారు. శాయ్ ఇన్చార్జ్, వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ కోచ్పై కేసు నమోదు విషయంలో రాజకీయ ఒత్తిడులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బెంగుళూరు శాయ్ బృందం దర్యాప్తులో వెల్లడి
10 మంది మహిళా క్రీడాకారిణుల ఫిర్యాదు