
వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా
తణుకు అర్బన్: స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు, 36 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంటాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు.
శనివారం యూనియన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణకు అందజేశారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికలకు ఇస్తున్న వేతనాలే తక్కువని వాటిని కూడా నెలా నెలా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సక్రమంగా రాకపోవడంతో కార్మికులు పస్తులతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 60 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారాన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధర్మాని పుష్పలత, డి.ప్రసన్న కుమారి, మెండి శ్రీను, పి.లక్ష్మి, పి.రేణుక, ఎం.బేబి, ఇ.హైమావతి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం: స్థానిక ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏడో రోజు ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవాద్యక్షుడు జంపన వెంకటరమణ రాజు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లా డుతూ ఏరియా హాస్పిటల్ సానిటరీ వర్కర్స్కి గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ వేతనాలతో చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వేముల రాజు, సంజీవ్, మేరీ, చంద్రకళ, దయామని, జె.దుర్గారావు, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా