ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
నర్సంపేట: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణ అభివృద్ధికి కృషిచేస్తామని చైర్పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ప్రకటించిన పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పేర్కొన్నారు. నర్సంపేటలో శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోనే నర్సంపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 25వ వార్డు నుంచి 386 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం వెనుక ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
కార్మికులకు అండగా ఉంటా...
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో పూర్వం కమ్యూనిస్టులకు గట్టిపట్టు ఉందని, పేదల పక్షాన పోరాడిన కమ్యూనిస్టులకు అండగా నిలి చిందని పదో వార్డు నుంచి 70 ఓట్ల మెజార్టీతో గెలిచిన హన్మకొండ శ్రీధర్ అన్నారు. ప్రజలు, కార్మికులకు అండగా ఉంటానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. బడుగు బలహీనవర్గాలు, కార్మిక, కర్షకుల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకే తనను ఆదరించి గెలిపించారని, ఎలాంటి సమస్యలు ఉన్నా అందరి సహాయసహకారాలతో పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. కాగా, శ్రీధర్ తండ్రి 2004లో నర్సంపేట గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సీపీఎం నుంచి వార్డు సభ్యుడిగా గెలుపొందారు.
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిచేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేసిందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు అభ్యర్థులు, వారి ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు కల్పించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధి కారులు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ది అధికార దుర్వినియోగం
● వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిరసిస్తూ శుక్రవారం ఆయన వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు కిలోమీటరు మేర వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే ఏసీపీ అంబటి నర్సయ్య పోలీస్ సిబ్బందితో బలవంతంగా అరూరి రమేశ్ను రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినా కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. చివరకు పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను చెదరగొట్టారు. స్వతంత్ర అభ్యర్థి శీభారాణిని కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకునే క్రమంలో లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 12వ వార్డు అభ్యర్థి గుండె స్వప్నిక 7 ఓట్లతో గెలిచిందని అధికారులు తెలిపిన వెంటనే మాట మార్చి.. కాంగ్రెస్ అభ్యర్థి తిరుపల్లి వాణి 13 ఓట్లతో గెలుపొందిందని ప్రకటించడం అన్యాయమన్నారు. రీకౌంటింగ్ చేస్తే తమ అభ్యర్థికి అవే ఓట్లువస్తే అభ్యంతరం చెప్పేవారం కాదన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి


