భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 (జీ)కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల ల్యాండ్ అక్విజేషన్ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 (జీ) మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన నేషనల్ హైవేలో మొత్తం 176.52 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్కు గాను ఇప్పటివరకు 171.34 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్ పూర్తి అయిందని, పెండింగ్ అవార్డును ఈ నెల 10 వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. భూమి కోల్పోయిన రైతుల నష్టపరిహారం త్వరగా చెల్లించి ల్యాండ్ ఆక్విజేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమా, ఉమారాణిలు, తహసీల్దార్ శ్రీకాంత్, ఏడీ సర్వే ల్యాండ్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
పంట, ఆస్తి నష్టం వివరాలు సమర్పించాలి
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్ట వివరాలు నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో జరిగిన నష్ట వివరాల నమోదు పురోగతి, పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా, మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లోగా రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వ్యవసాయ, ఆర్అండ్బీ, ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పశు సంవర్థక అధికారులు పాల్గొన్నారు.


