ఎమ్మెల్యే ‘చల్లా’ మోసం చేశారు.. సీఎం మంజూరు చేసిన రూ.5 కోట్లు మళ్లించారు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ‘చల్లా’ మోసం చేశారు.. సీఎం మంజూరు చేసిన రూ.5 కోట్లు మళ్లించారు

Published Thu, Jun 29 2023 1:24 AM

కోటగండి వద్ద మాట్లాడుతున్న వంచనగిరి వాసులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు  - Sakshi

గీసుకొండ: వంచనగిరికి సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన నిధులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మళ్లించి తమకు అన్యాయం చేశారని వంచనగిరి గ్రామస్తులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మండలంలోని కోటగండి వద్ద వారు బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2017లో అప్పటి ఎమ్మెల్సీ కొండా మురళి వినతి మేరకు సీఎం కేసీఆర్‌ వంచనగిరికి రూ.9.50 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధుల్లో కేవలం రూ.3.38 కోట్ల పనులు చేశారని, మరో రూ.1.29 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

కొండా మురళి పార్టీ మారాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామానికి మంజూరైన రూ.5 కోట్ల బ్యాలెన్స్‌ నిధులను ఇతర గ్రామాలకు మళ్లించారన్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. సర్పంచ్‌, ఎంపీటీసీ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కావడంతో ఈజీఎస్‌ నిధుల మంజూరులోనూ వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు.

మొరం, మట్టి తరలించే వాహనాలు, టెక్స్‌టైల్‌ పార్కు నుంచి వచ్చిపోయే వాహనాలతో శాయంపేట–స్తంభంపల్లి రోడ్డు శిథిలమైందన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే మళ్లించిన నిధులను గ్రామానికి కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్‌ అమిరిశెట్టి అనసూర్య, ఎంపీటీసీ నాగరబోయిన రజితసారంగం, మండల కోఆప్షన్‌ సభ్యుడు రహీం, వార్డు సభ్యులు కరుణాకర్‌, అమిరిశెట్టి రాజు, నల్ల సురేశ్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement