ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం ఎస్ఎల్ఎన్ఎస్ ఇండస్ట్రీస్లో మంగళవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న ధాన్యం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. 2022–23 వానాకాలం, యాసంగితో పాటు 2023–24 వానాకాలం మొత్తం 7,303.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా.. ఇప్పటి వరకు 3,874.478 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యం మాత్రమే అప్పగించారన్నారు. ప్రస్తుతం మిల్లులో 13.32 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉందని.. ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన ధాన్యంలో 3,415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ఉన్నట్లు తనిఖీలో గుర్తించామని వివరించారు. ఈ విషయమై పంచనామా నిర్వహించామని.. తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట డీటీ పరమేశ్వర్ ఉన్నారు.


