భద్రత.. కరువు!
బీఓసీడబ్ల్యూ నమోదుకు చెల్లుచీటి
లేబర్ కోర్టులో దావా వేస్తే..
–8లో u
వనపర్తి: కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా.. నేటికీ అందని ద్రాక్షగానే మారాయని చెప్పవచ్చు. ఇందుకు అక్టోబర్ 26న జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం వద్ద బిహార్ కార్మికుడి మృతి, అక్టోబర్ 31న పెబ్బేరు మండలం వైశాఖాపూర్ శివారు పెద్దగుట్ట మైనింగ్ రీచ్లో డ్రైవర్ బాలరాజు మృతి ఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. భారత ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికుల కోసం 1996లో బీఓసీడబ్ల్యూ (బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్) చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ చట్టాన్ని నిరక్ష్యరాస్యులైన కార్మికులు ఆశించిన స్థాయిలో వినియోగించుకోవడం లేదు. అవగాహన కల్పించాల్సిన కార్మికశాఖలో అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి కార్మికులకు అందాల్సిన భరోసా ఊరించేందుకే పరిమితమైంది.
బడా కాంట్రాక్టర్లకు నో రూల్స్..?
రూ.వందల కోట్ల పనులు చేసే బడా కాంట్రాక్టర్లకు అనాధిగా చట్టం చుట్టంగా మారుతూనే ఉంది. వనపర్తి సమీకృత కలెక్టరేట్కు అతి సమీపంలో సుమారు రూ.205 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్, రెసిడెన్సీ తదితర బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. స్వరాష్ట్రంతో పాటు బిహార్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడే ఉంటూ పనులు చేపడుతున్నారు. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్పించాల్సిన భద్రత విషయంలో కాంట్రాక్టర్ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆ వైపు చూసేందుకు అధికారులు ఎన్నడూ ఆసక్తి చూపలేదు. ఇందుకు రాజకీయ నాయకుల ఆశీస్సులు లేదా ఇంకేవైనా కారణాలు కావచ్చు. దీంతో ఇక్కడ పని చేసే కార్మికులకు ప్రభుత్వం నుంచి ఇప్పించాల్సిన బీఓసీడబ్ల్యూ సంక్షేమ గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. ఇదివరకు పలువురు కార్మికులు చిన్న చిన్న ప్రమాదాల బారిన పడినా.. విషయం బయటకు రానివ్వకుండా కాంట్రాక్టర్ తరుపు ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఇటీవల ఓ కార్మికుడు మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి మృతి చెందడంతో జిల్లాలో వలస కార్మికుల విషయంలో అధికారుల డొల్లతనం బయపడిందని చెప్పవచ్చు.
బీహార్ కార్మికుడు తిలక్సా మృతిచెందిన
వైద్య కళాశాల భవనం ఇదే
అందుబాటులో లేని
ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు
తహసీల్దార్, ఠాణాల్లో
నమోదు చేయని కాంట్రాక్టర్లు
పని ప్రదేశాల్లో జాగ్రత్తలపై
పర్యవేక్షణ ఏది?
మేనమీషాలు లెక్కిస్తున్న అధికారులు
కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నట్లేనా?
భవన నిర్మాణం, ఫ్యాక్టరీలు, గనులు, రోడ్డు(ప్రభుత్వ, ప్రైవేటు) పనుల వద్ద ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికులకు కార్మికశాఖలో రిజిస్ట్రేషన్ లేకున్నా డబ్ల్యూసీ యాక్ట్ ప్రకారం లేబర్ కోర్టులో దావా వేస్తే ప్రభుత్వం తరుఫున పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల వద్ద జరిగిన ఘటనలో మృతిచెందిన కార్మికుడికి మా వద్ద రిజిస్ట్రేషన్ లేదు. అలాగే పెద్దగుట్ట మైనింగ్ రీచ్లో స్తంభం పడి మృతిచెందిన డ్రైవర్ రిజిస్ట్రేషన్ విషయం పరిశీలిస్తాం. ఆయా విషయాలను శాఖ ఉన్నతాధికారులకు నివేదించాం. వారు ఈ రెండు ఘటనా స్థలాలను పరిశీలిస్తామన్నారు.
– వేణుగోపాల్,
జిల్లా సహాయ కార్మికశాఖ అధికారి
‘పెబ్బేరు మండలం శాఖాపూర్ శివారులో ఉన్న ఓ మైనింగ్ రీచ్ వద్ద అక్టోబర్ 31న విద్యుత్ స్తంభం పడి కొత్తకోట మండలం నాచవెళ్లికి చెందిన బాలరాజుగౌడ్ అనే
కార్మికుడు మృతి చెందాడు. ఇతడు టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు.
రీచ్లో పొక్లెయిన్తో కొనసాగుతున్న పనుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబానికి వర్తించాల్సిన ఇన్సూరెన్స్, ఇతర
అంశాల ప్రస్తావన పక్కనబెట్టి రూ.లక్షల్లో పరిహారం చెల్లించేలా ప్రైవేటు వ్యక్తుల ఒప్పందంతో ఎలాంటి హడావుడి లేకుండా ఘటన సద్దుమణిగింది. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగుచూస్తున్నా..
కార్మికశాఖ మేల్కోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.’

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
