ఉమ్మడి జిల్లాలో నీరుగారుతున్న పథకం
అవగాహన లేకపోవడంతో..
మచ్చుకు కొన్ని..
●
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/వనపర్తి టౌన్: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్ స్కీం (బీఏఎస్) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్ పద్ధతి లేదా డే స్కాలర్ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది.
బీఏఎస్ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, హాస్టల్, పాఠశాల, షూ, అడ్మిషన్ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● దసరా సెలవుల తర్వాత బీఏఎస్ స్కీం ద్వారా చదువుతున్న విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు అనుమతించలేదు. ఈ క్రమంలో బహుజన విద్యార్థి సంఘంతో పాటు మరిన్ని సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ కలెక్టరేట్ను ముట్టడించడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ హామీ మేరకు పాఠశాలలకు యాజమాన్యాలు అనుమతించాయి.
జిల్లాల వారీగా బీఏసీ పాఠశాలలు, విద్యార్థులు ఇలా..
జిల్లా బీఏసీ ఎస్సీ ఎస్టీ
పాఠశాలలు విద్యార్థులు విద్యార్థులు
మహబూబ్నగర్ 12 806 356
వనపర్తి 8 532 84
నాగర్కర్నూల్ 18 1,062 208
నారాయణపేట 1 120 30
గద్వాల 11 442 240
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు
నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి
తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు,
హాస్టల్స్కు డబ్బులు వసూలు
అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు
మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు షూలు పాఠశాల యాజమాన్యం ఇప్పించకపోతే తల్లిదండ్రులే ఇప్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని పాఠశాలను ఆదేశించినా ఇప్పటికీ అలా చేయలేదు.
జిల్లాకేంద్రంలోని వన్టౌన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలల్లో బీఏఎస్ స్కీం కింద చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్స్కు డబ్బులు కట్టే దాక యాజమాన్యం వినకపోవడంతో తల్లిదండ్రలు చెల్లించే పరిస్థితి నెలకొంది.
వనపర్తి జిల్లా కేంద్రంలో బీఏఎస్ స్కీం ద్వారా ఎన్నికై న విద్యార్థులను ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు బయటికి పంపించడంతో తల్లిదండ్రులు డీఈఓ, సంక్షేమ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ పాఠశాల బీఏఎస్ స్కీం డబ్బులు గత మూడేళ్లుగా రావడం లేదని ఈసారి స్కీం ద్వారా విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్లు కల్పించలేదు.


