దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
వనపర్తి: స్వతంత్ర దేశంలో 562 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతావని నిర్మాణానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదర్శ్ సురభి కోరారు. మాజీ ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ఆర్డీఓ కార్యాలయ చౌరస్తా మీదుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ 2కే పరుగు పందాన్ని ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అటవీశాఖ అధికారి కె.అరవింద్ ప్రసాద్రెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి అనేక సంస్థానాల్లో రాజులు పాలన కొనసాగిస్తుండేవారని, అందులో హైదరాబాద్ సంస్థానం సైతం ఒకటని గుర్తు చేశారు. దేశం 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, 2047 నాటికి రాష్ట్రం 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమి సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. యువత విదేశాల్లో ఎక్కడ ఉన్నా స్వదేశానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. యువత కులమతాలకు అతీతంగా, ఐక్యంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరికి వారు ప్రత్యేకం కాదని.. అందరూ కలిసికట్టుగా ఉండి విజయం సాధించాలని, ఆస్ట్రేలియాతో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చిరస్మరణీయమైన విజయం ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతలు గుర్తెరిగి పారిశుద్ధ్యం, పచ్చదనం సంరక్షణలో తమవంతు బాధ్యత వహించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్, యువజన సర్వీసులు, క్రీడల అధికారి సుధీర్రెడ్డి, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత రన్లో పాల్గొన్నారు.


