
తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి
వనపర్తి: తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మొదటి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పుడు కేసులు నమోదు చేస్తే కమిటీ సభ్యులు నచ్చజెప్పి ఉపసంహరించుకునేలా చూడాలని సూచించారు. తప్పుడు కేసులు నమోదు చేయడం, తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా బయట రాజీ కుదర్చడంతో చట్టం నీరుగారుతుందన్నారు. అదేవిధంగా ఎక్కడ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవుతున్నాయి.. ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి అనే విషయాలు నిశితంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తే ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించవచ్చని పోలీస్శాఖను ఆదేశించారు. ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవం ఏ గ్రామంలో నిర్వహించాలనే షెడ్యూల్ ముందుగానే రూపొందించి కమిటీ సభ్యులు, అధికారులకు అందజేశారని.. పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైనా అంటరానితనం వంటి సమస్యలు గుర్తిస్తే కమిటీ సభ్యులు, పోలీసులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 58 ఎస్సీ, 10 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని వివరించారు. మొదటి దశలో 48 మందికి చట్ట ప్రకారం నష్ట పరిహారం రూ.2.72 లక్షలు, రెండో దశలో 25 మందికి రూ.40 లక్షలు పరిహారంగా అందజేయగా.. ఇంకా 21 మందికి మంజూరు కాలేదని తెలిపారు. 59 కేసుల్లో చార్జ్షీట్ ఫైల్ చేయడంతో పాటు 108 పీటీ కేసులు నమోదైనట్లు చెప్పారు. జిల్లా సంక్షేమశాఖ ద్వారా 2024 నుంచి ఎస్సీ, ఎస్టీ పోక్సో కేసులు 26 నమోదయ్యాయని.. వాటిలో 17 కేసులకు రూ.6.50 లక్షలు పరిహారంగా అందజేసినట్లు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్కు నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఎడవల్లి వీరప్ప మాట్లాడుతూ.. ముమ్మళ్లపల్లి, గోపాల్పేట మండలం చాకల్పల్లిలో బుడగ జంగాల వారిని బెదిరించడం, రచ్చకట్టపై కూర్చోకుండా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్ బెదిరించే వారిపై కేసులు నమోదు చేసి తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా కమిటీ సభ్యులు వెళ్లి బుడగ జంగాల ప్రజలకు ధైర్యం చెప్పాలని సూచించారు. బుడగ జంగాల విద్యార్థులకు హాస్టల్ వసతి, పాఠశాలలో సీటు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ గోవింద్ నాయక్, డీఐఈఓ అంజయ్య, డీడబ్ల్యూఓ సుధారాణి, ిసి.విశ్వంబాబు, నాగన్న, రామచందర్, వీరప్ప మాదారి భోజరాజు, స్వచ్ఛంద సంస్థల నుంచి చిన్నమ్మ థామస్, ఏకే కమర్ రహమాన్ పాల్గొన్నారు.