● తప్పిన పెనుప్రమాదం
రాజాం సిటీ: మండల పరిధి సోపేరు రోడ్డులోని ఎస్ఆర్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది అంతా అప్రమత్తమై ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే రాజాం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ఘటనలో ఒక ట్రాన్స్ఫార్మర్తోపాటు ప్రయోగశాల పరికరాలు, ఎలక్ట్రికల్ ఫ్యానళ్లు, ఇండోర్ వీసీబీ, విద్యుత్ వైరింగ్ కాలిపోగా శ్లాబ్ కొంతభాగం పాడైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఎస్సై అశోక్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్లు మేర ఆస్తినష్టం సంభవించిందని అంచనా వేశామన్నారు.


