● డీఎఫ్ఓకు అగ్నిమాపక సంఘం విన్నపం
విజయనగరం క్రైమ్: అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సాయిరాజేష్ను విజయనగరం ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు విజయనగరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఇటీవల జిల్లాలో పునః ప్రారంభించిన సిబ్బంది ముఖ హాజరు వల్ల తలెత్తే సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అధికారి రమేష్ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత వల్ల 24 గంటలూ విధుల్లో ఉంటున్నామని, అగ్ని ప్రమాదాలు రెస్క్యూ, అవుట్ డ్యూటీలు, బందోబస్తు, వీఐపీ కాన్వాయ్ ఇతర విధుల నిమిత్తం బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ప్రతీ కేంద్రంలో సిబ్బంది కొరత ఉందని, విధుల్లో కాస్త సడలింపు ఇవ్వాలని డీఎఫ్ఓను కోరామని తెలిపారు. తమ సమస్యలపై డీఎఫ్ఓ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమోహన్, ఉపాధ్యక్షుడు డి.ప్రకాష్, కోశాధికారి జి.ఆదినారాయణ, సలహాదారుడు ఎల్.ఉమామహేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎస్కే జగదీష్, కేంద్ర ప్రతినిధులు, పలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి, గజపతినగరం సెల్ : 90102 04447


