
ఇదెక్కడి అన్యాయం బాబూ..!
వసాది గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి లక్ష్మీనారాయణ మే నెలలో చనిపోయారు. అతని భార్య ఎర్రయ్యమ్మ భాగస్వామి కోటా కింద వితంతుపింఛన్ కోసం దరఖాస్తు చేసింది. జూన్ నెలలో ఆమెకు కూడా పింఛన్ మంజూరైనట్టు సచివాలయ ఉద్యోగులు చెప్పారు. శుక్రవారం సచివాలయం ఉద్యోగులను ఆమె అడిగితే మా లాగిన్లో పింఛన్ రాలేదని చెప్పడంతో ఆమె కూడా అయోమయానికి గురయ్యారు. ఉద్యోగుల వద్దే ఆవేదన వ్యక్తంచేశారు.
‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి సారిక పోలయ్య ఈ ఏడాది మే నెలలో చనిపోయారు. ఇతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో అతని భార్య కళావతి భాగస్వామి (స్పౌజ్) కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ నెలలో పింఛన్ మంజూరైనట్టు సచివాలయం ఉద్యోగులు చెప్పారు. జూన్ 12వ తేదీన పింఛన్ డబ్బులు అందజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీని వాయిదా వేయడంతో ఆ నెలలో డబ్బులు అందలేదు. ఆగస్టు నెలలో భాగస్వామి పింఛన్దారులకు డబ్బులు అందజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీ కావడంతో కళావతి పింఛన్ డబ్బుల కోసం సచివాలయం ఉద్యోగులను శుక్రవారం కలిశారు. లాగిన్లో పేరు లేదని చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలైంది. జూన్నెలలో మంజూరైనట్టు చెప్పి ఇప్పుడు పేరులేదంటున్నారేమిటంటూ ఆమె గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది.’
గంట్యాడ:
పింఛన్ డబ్బులు వస్తే ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయని నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఆగస్టు నెలలో పింఛన్ డబ్బులు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు నెలల కింద పింఛన్ మంజూరైందని చెప్పిన ఉద్యోగులే.. ఇప్పుడు మీ పేరు లాగిన్లో లేదని చెప్పడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదెక్కడి అన్యాయం బాబూ అంటూ ప్రశిస్తున్నారు. కూటమి నేతల ఒత్తిడితో కొంతమంది లబ్ధిదారులకు పింఛన్లు నిలిపివేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లేదంటే పింఛన్ ఐడీ వచ్చిన తర్వాత లాగిన్లోకి రాకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా కొత్తగా పింఛన్లు మంజూరు చేయని కూటమి సర్కారు.. భాగస్వామి కోటాలో భర్త చనిపోతే భార్యకు మంజూరు చేసే పింఛన్లలో కూడా కోతపెట్టి వితంతువులను ఆవేదనకు గిరిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మా దృష్టికి వచ్చింది
వసాది, పెదవేమలి గ్రామాల్లో జూన్ నెలలో పింఛన్ మంజూరైనట్టు ఐడీ వచ్చి ఇప్పడు మంజూరు కాని విషయం మా దృష్టికి వచ్చింది. మిగిలిన గ్రామాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా సేకరించి క్లారిఫికేషన్ కోసం డీఆర్డీఏ పీడీకి లేఖరాస్తాం.
– ఆర్.వి.రమణమూర్తి,
ఎంపీడీఓ, గంట్యాడ
జూన్ నెలలో పింఛన్ మంజూరు
ఆగస్టులో జాబితాలో పేరు తొలగింపు
అయోమయంలో లబ్ధిదారులు

ఇదెక్కడి అన్యాయం బాబూ..!