
సోషల్ మీడియా పోస్టులపై ఎస్పీ కన్నెర్ర
విజయనగరం క్రైమ్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టవద్దని ఎస్పీ వకుల్జిందల్ కోరారు. కుల, మత, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని బుధవారం ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ మతాలను, కులాలను, రాజకీయ పార్టీలను రెచ్చగొడుతూ ట్విట్టర్, ఫేస్బుక్, ఇనస్ట్రాగాం, యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి ద్వారా మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్నారు. ఇందుకుగాను ఒక పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కాగా జిల్లాలోని డెంకాడ మండలం టి.కళ్లాలు (చిన మోపాడ)లో ఓ ప్రార్థనా మందిరం ఆవరణలో ఉన్న విగ్రహంపై చెట్టు కొమ్మ పడి విగ్రహం పాడైపోతే, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి, అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వినియోగిస్తున్న ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. వాస్తవాలను తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టేటపుడు ఇతరుల మతాలు, కులాలు, మనోభావాలకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకుండా ఉండాలని హితవు పలికారు.
అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు
నెటిజెన్స్కు హెచ్చరిక