అంగన్వాడీల జీతాలు పెంచాలని ఆందోళన
బీచ్రోడ్డు: తక్షణం వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా 42 రోజులు నిరవధిక సమ్మె చేశామన్నారు. ఆ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ అంగన్వాడీల వేతనం పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు గడిచినా ఇంత వరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించాలన్నారు. వేతనాల పెంపు, 1972 యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ మంజూరు, అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మే నెలంతా వేసవి సెలవుల ప్రకటన, అదనపు పనులు, యాప్లతో పని భారం తగ్గింపు, రాజకీయ వేధింపుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి. శ్యామలాదేవి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు పడాల రమణ, ఎ. నూకరత్నం. పి.కృపారాణి, అనిత, లక్ష్మీపార్వతి, భీమిలి, పెందుర్తి అర్బన్ ప్రాజెక్ట్స్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.


