అందంగా.. ఆదాయ వనరుగా లోకోలు
తాటిచెట్లపాలెం: భారతీయ రైల్వేలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో దూసుకుపోతోంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో పది లోకోమోటివ్ (ఇంజిన్)లపై వాణిజ్య ప్రకటనల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ కేటరింగ్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ, ఈ–వేలం ద్వారా రాబోయే మూడేళ్ల కాలానికి ఈ టెండర్ను దక్కించుకుంది. పది డబ్ల్యూఏపీ–7 లోకోమోటివ్లపై ఈ ప్రకటనలను ప్రదర్శిస్తారు. ఈ ప్రకటనల ద్వారా ఏడాదికి రూ.7 లక్షల చొప్పున, మూడు సంవత్సరాల కాలానికి మొత్తం రూ. 26 లక్షల ఆదాయం నాన్–ఫేర్ రెవెన్యూ రూపంలో వాల్తేరు డివిజన్కు సమకూరనుంది. వినూత్న పద్ధతుల్లో ఆదాయాన్ని సృష్టిస్తున్న కమర్షియల్ విభాగాన్ని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర అభినందించారు. ఈ పద్ధతి వల్ల అటు రైల్వేకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా, సాధారణంగా ఒకే రంగులో ఉండే ఇంజిన్లు రంగురంగుల ప్రకటనలతో కళాత్మకంగా కనిపించనున్నాయి.


