దారులనీ్న.. ఊరివైపే..
విశాఖ సిటీ: నగరం పల్లె బాట పడుతోంది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే ఊరు ఖాళీ అయిపోతోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన కుటుంబాలు సొంతూళ్లకు పయనమవుతున్నాయి. పెద్ద పండగకు ముందే సెలవులు రావడంతో జనాలు అప్పుడే బస్సులు, రైళ్లు ఎక్కేస్తున్నారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వీటితో పాటు విమాన సర్వీసులు కూడా ఫుల్ అయిపోతున్నాయి. ప్రధానంగా పండగ తర్వాత తిరుగుపయనాల సమయాల్లో టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకునేందుకు బస్సుల నుంచి విమానాల వరకు అన్ని టికెట్లు ధరలు విపరీతంగా పెంచేశారు. అయినప్పటికీ టికెట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
21వ తేదీ వరకు ఫుల్
రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. వాల్తేరు డివిజన్ 18 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఈ నెల 21వ తేదీ వరకు రైళ్లు ఫుల్ అయినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి విశాఖ మీదుగా వెళ్లే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ అవి సరిపడని పరిస్థితి కనిపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది.
విమాన టికెట్లకు గిరాకీ
బస్సు, రైళ్లు కిటకిటలాడుతుండడంతో ప్రయాణికులు విమాన సర్వీసుల వైపు మల్లుతున్నారు. దీంతో విమాన సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చే విమాన టికెట్ ధర ఏకంగా రూ.10,800 వరకు ఉండడం గమనార్హం. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం 60 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణంగా రూ.3,800 నుంచి రూ.4,300 వరకు ఉండే ధర.. పండగ సందర్భంగా రెండు, మూడింతలు పెంచేశారు. ఆ తర్వాత రోజుల్లో కూడా ప్రస్తుతానికి రూ.6100 నుంచి రూ.6,500 వరకు ఉంది. మరో ఒకటి, రెండు రోజుల్లో డిమాండ్ను బట్టి వీటి ధరలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దేశీయ విమాన టికెట్ల ద్వారా సింగపూర్, అబుదాబి(దుబాయ్) టికెట్ల కూడా డిమాండ్ పెరిగింది. వీటి ఆక్యుపెన్సీ కూడా 80 శాతం దాటుతోంది. తిరుగు ప్రయాణాల ఎక్కువగా ఉండే 17, 18, 19 తేదీల్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
సంక్రాంతి సందర్భంగాపల్లె బాట పట్టిన నగరం కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్, బస్టాండ్
ప్రత్యేక బస్సులు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ సారి ఏకంగా 1,007 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సాధారణ రోజుల్లో విశాఖ రీజియన్ నుంచి నిత్యం 1,100 వరకు ఆర్టీసీ సర్వీసులు ఇతర జిల్లాలకు రాకపోకలు సాగిస్తుండగా.. ఈ ఏడాది వీటికి అదనంగా మరో 1,007 బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం తదితర దూరప్రాంత బస్సులతో పాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతిపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు ముందస్తు బుకింగ్లతో ఫుల్ అయిపోతున్నాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోతుండడంతో అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖ–హైదరాబాద్ స్లీపర్ ఇప్పటి వరకు రూ.1600 నుంచి రూ.1800 ఉండగా.. పండగ సందర్భంగా కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు రూ.3,200 నుంచి రూ.3,500 వరకు పెంచేశారు.
దారులనీ్న.. ఊరివైపే..


