మైనింగ్ పిడుగు?
ఆందోళనలో ఇచ్ఛాపురం
గ్రామ గిరిజనులు
పచ్చని కొండల్లో
క్వార్జైట్ తవ్వకాలకు యత్నాలు
అడ్డుకుంటామంటున్న రైతులు
గిరిజన పల్లైపె
కొండపై పచ్చని తోటలు, కింద వరి సాగుతో కళకళలాడుతున్న ఇచ్ఛాపురం గిరిజన పల్లె
తగరపువలస: ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన ఇచ్ఛాపురంలో మైనింగ్ ముప్పు ముంచుకొస్తోంది. ఇక్కడి సర్వే నంబర్ 37పీలో మైనింగ్ తవ్వకాల కోసం తెరచాటుగా అనుమతుల ప్రక్రియ చకాచకా సాగిపోతోంది. నీళ్లకుండీలు–విజయనగరం రహదారిలో బాకూరుపాలెం గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో.. పచ్చని కొండల మధ్య కాలుష్యానికి ఆమడ దూరంగా ఉన్న ఈ గ్రామంలో 60 గిరిజన కుటుంబాలకు చెందిన 300 మంది నివసిస్తున్నారు. కనీస వసతులు, సరైన రహదారి కూడా లేని ఈ గ్రామంలోని సహజ వనరుల దోపిడీకి రంగం సిద్ధమవుతోంది. గ్రామంలో 80 ఎకరాల వరకు జిరాయితీ భూములు కాగా, 600 ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఉన్నాయి. జగ్గమ్మ గెడ్డ కాలువ ఏడాది పొడవునా ప్రవహిస్తుండటంతో, ఒక పంట చేతికొచ్చిన వెంటనే మరో పంట వేయడం ఇక్కడి రైతులకు ఆనవాయితీ. వరితో పాటు వేరుశనగ, పెండలం, కొండవాలులో నీలగిరి, మామిడి, జీడి, అరటి, మునగ తోటలను వీరు సాగు చేస్తుంటారు. అయితే, అమాయకులైన గిరిజనులను గుప్పిట్లో పెట్టుకున్న కొందరు బడా వ్యాపారులు.. వారి పేరుతోనే ఈ కొండపై తోటలు సాగు చేయిస్తూ, వచ్చే లాభాల్లో 80 శాతం తాము తీసుకుని, మిగిలిన 20 శాతం మాత్రమే గిరిజనులకు ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు.
అంతా రహస్యమేనా.?
కుసులవాడ గ్రామ పంచాయతీలో ప్రతీదీ రహస్యంగానే జరుగుతోంది. ఇక్కడి ప్రజలకు కనీస సమాచారం లేకుండానే మైనింగ్ అనుమతులు తెచ్చుకోవడం, పశు మాంసం వ్యర్థాలు పూడ్చడం వంటివి చేస్తున్నారు. పంచాయతీలో 4,500 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నా, వాటిని పరిశ్రమల కోసం లేదా ప్రజావసరాల కోసం వినియోగించడం లేదు.
– షిణగం దామోదరరావు, వైఎస్సార్ సీపీ
మండల ఉపాధ్యక్షుడు, ఆనందపురం
దత్తత గ్రామంలో
గిరిజనులకు కష్టాలు
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మా పంచాయతీని దత్తత తీసుకున్నప్పుడు రోడ్లు, వీధిదీపాలు, తాగునీరు వంటి వసతులు కల్పిస్తారని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు మైనింగ్ పేరుతో భయపెడుతున్నారు. ఇదే జరిగితే ఇక్కడి 60 కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. – వరపుల అర్జున్,
మాజీ సర్పంచ్, కుసులవాడ
గట్టిగా ప్రతిఘటిస్తాం
మా తాతల కాలం నుంచి తోటలు సాగు చేసుకుంటూ ఎన్ని కష్టాలు ఎదురైనా జీవిస్తున్నాం. ఇప్పుడు కొండల తవ్వకాలు జరిగితే తోటలు నాశనమై, పంటలు పండక, పశువులకు మేత దొరకక మట్టిపాలవుతాం. మా ప్రాణం పోయినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలను అడ్డుకుంటాం.
– వరపుల ఎర్రయ్య, గిరిజన రైతు
ఆనందపురం మండలం, కుసులవాడ పంచాయతీ పరిధిలోని ఇచ్ఛాపురం గిరిజన గ్రామానికి ముప్పు పొంచి ఉంది. పచ్చని కొండల మధ్య ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల బతుకుల్లో మైనింగ్ చిచ్చు రగల్చబోతోంది. స్థానిక ఎమ్మెల్యే దత్తత తీసుకున్న కుసులవాడ పంచాయతీలోని ఈ గ్రామంలో అభివృద్ధి మాట అటుంచి.. రహస్యంగా మైనింగ్ అనుమతులు పొందుతూ.. గిరిజనుల జీవనాధారమైన కొండలను పిండి చేసేందుకు
బడా బాబులు సిద్ధమవుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
దత్తత పంచాయతీలో దగా!
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల సమయంలో కుసులవాడ పంచాయతీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గెలిచిన తర్వాత కూడా ఇదే మాట చెప్పారు. దీంతో తమ పంచాయతీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశపడ్డ గిరిజనులకు నిరాశే మిగిలింది. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. మైనింగ్, పశు మాంసం వ్యర్థాలను పూడ్చడం వంటి చర్యలతో గ్రామాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నాగ్పూర్కు చెందిన మెస్సర్స్ అగ్నిసుముఖ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇచ్ఛాపురంలో ఐదేళ్ల పాటు క్వార్జైట్ రాయి తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 15 హెక్టార్లలో తవ్వకాలు జరపడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు గిరిజనులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో మైనింగ్కు అనుమతులు కోరితే ప్రజాభిప్రాయ సేకరణ అవసరమవుతుందని, దాన్ని తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. మొదటి దశలో 4.990 హెక్టార్ల కోసం అనుమతులు తీసుకుని, విడతల వారీగా మైనింగ్ చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా మైనింగ్ జరిగితే పంటలు, తోటలు నాశనమై, బతుకుదెరువు కోసం వలసలు పోవడం తప్ప మరో మార్గం ఉండదని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై కుసులవాడ వీఆర్వో కృష్ణ నరసింహులును సంప్రదించగా.. గిరిజనులు మైనింగ్ను వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.
మైనింగ్ పిడుగు?
మైనింగ్ పిడుగు?
మైనింగ్ పిడుగు?
మైనింగ్ పిడుగు?
మైనింగ్ పిడుగు?
మైనింగ్ పిడుగు?
మైనింగ్ పిడుగు?


