యూనిట్ను పరిశీలించిన ఉన్నతాధికారులు
విస్తరణ: 8.33 ఎంఎంటీ నుంచి15 ఎంఎంటీకి పెంపు కీలక విభాగం: ఆర్యూఎఫ్ (2019 మార్చిలో పనులు ప్రారంభం) టెక్నాలజీ: ఎల్సీ మ్యాక్స్ సాంకేతిక సహకారం: షెవ్రాన్ లుమ్మస్ గ్లోబల్ (అమెరికా) రియాక్టర్ల బరువు: ఒక్కొక్కటి 2,200 టన్నులు ఆర్యూఎఫ్ సామర్థ్యం: ఏడాదికి 3.35 ఎంఎంటీ ఉత్పత్తులు: హైస్పీడ్ డీజిల్, ఎల్పీజీ, నాఫ్తా, గ్యాసోలిన్ ప్రాసెసింగ్ సామర్థ్యం: అవశేషాల్లో 93 శాతం వరకు ఇంధనంగా మార్పు
రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ యూనిట్
సాధారణంగా ముడి చమురును శుద్ధి చేసేటప్పుడు పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ వంటివి వేరు చేసిన తర్వాత, చివరికి నల్లగా, చిక్కటి తారు వంటి పదార్థం(వాక్యూమ్ రెసిడ్యూ) అవశేషంగా మిగులుతుంది. దీనిని బాటమ్ ఆఫ్ ది బ్యారెల్ అని పిలుస్తారు. గతంలో ఈ పదార్థాన్ని తక్కువ ధరకు తారు రూపంలోనూ లేదా ఓడల ఇంధనంగానో విక్రయించేవారు. మార్కెట్లో వీటి విలువ చాలా తక్కువ. అయితే, ఇందులో ఉండే మిగులు ఇంధనాన్ని వెలికి తీసి వినియోగించుకోవడం దేశంలోని చమురు రిఫైనరీలకు పెద్ద సవాల్గా ఉండేది. దీనిపై సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాత హెచ్పీసీఎల్ ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆవిష్కరించింది. అదే చమురు అవశేషాల శుద్ధి కర్మాగారం(ఆర్యూఎఫ్). హెచ్పీసీఎల్ ప్లాంట్ని 8.33 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 ఎంఎంటీ వరకూ చేపట్టిన విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆర్యూఎఫ్(రఫ్)ని కూడా ఏర్పాటు చేశారు. ఏడాదికి 3.35 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. చమురు అవశేషాల వ్యర్థాలను వృథా చేయకుండా తిరిగి ప్రాసెస్ చేసి, అత్యంత విలువైన డీజిల్, నాఫ్తా, ఎల్పీజీ, గ్యాసోలిన్ వంటి ఇంధనాలుగా ఈ ప్లాంట్లో మారుస్తారు.
ప్రపంచంలో తొలిసారిగా..
ఇప్పటివరకూ ఆర్యూఎఫ్ ప్లాంట్లు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో వేళ్లపై లెక్కపెట్టేవి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవన్నీ లిక్విడ్ కాటలిటిక్ ఫైనింగ్(ఎల్సీఎఫ్) యూనిట్లు. కానీ ప్రపంచంలో తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో ‘ఎల్సీ మ్యాక్స్’ యూనిట్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికతను అమెరికాకు చెందిన ‘షెవ్రాన్ లుమ్మస్ గ్లోబల్’ అనే సంస్థ అందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న సాంకేతికత. ‘బ్లాక్ గోల్డ్’ అని పిలిచే చిక్కటి చమురు మిగులు వ్యర్థాలను ఇది దాదాపు 93 శాతం వరకూ ప్రాసెస్ చేస్తుంది.
2019లో భారీ రియాక్టర్ల రాకతో..
ఈ ఆర్యూఎఫ్లో ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లను ఏర్పాటు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ తయారు చేసిన మూడు భారీ రియాక్టర్లను 2019 జూన్లో ఏర్పాటు చేయడం ద్వారా పనులు జోరందుకున్నాయి. ఒక్కో రియాక్టర్ ఏకంగా 2,200 టన్నుల బరువు ఉంటుంది. ఇవి సుమారు 420 డిగ్రీల ఉష్ణోగ్రత, 200 బార్ పీడనం వద్ద పనిచేస్తాయి. మన దేశంలో ఇలాంటి భారీ రియాక్టర్లను ఒకే చోట అమర్చడం ఇంజినీరింగ్ రంగంలోనే ఒక అద్భుతమని హెచ్పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్యూఎఫ్కి కీలకమైన క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ 2023 మార్చిలో అందుబాటులోకి వచ్చింది. ఆర్యూఎఫ్ యూనిట్ నిర్వహణలో ఏఐ వినియోగిస్తుండటం వల్ల, ఏ చిన్న లోపం తలెత్తినా ముందుగానే పసిగట్టవచ్చు. దీని వల్ల ప్రమాదాల ముప్పు తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
భారత దేశ ఇంధన భద్రతలో విశాఖ తీరప్రాంతం మరో మైలురాయిని అధిగమించింది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) విశాఖ రిఫైనరీని ఆధునికీకరించడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికత కలిగిన ‘రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ’(ఆర్యూఎఫ్)ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని కేవలం ఒక పరిశ్రమ విస్తరణలా మాత్రమే కాకుండా, భారత చమురు రంగం ‘వ్యర్థం నుంచి అర్థం’ వైపు వేసిన ఒక కీలక అడుగుగా పారిశ్రామిక వర్గాలు అభివర్ణిస్తున్నాయి. వ్యర్థంగా పారేసే చమురు అవశేషాల నుంచి అత్యంత నాణ్యమైన ఇం‘ధనం’ సృష్టించే ఈ ‘బ్లాక్ గోల్డ్’ మ్యాజిక్.. దేశ ఇంధన భద్రతలో ఒక గేమ్ ఛేంజర్గా మారనుంది.
– సాక్షి, విశాఖపట్నం
ప్రాజెక్టు విశేషాలు
హెచ్పీసీఎల్ ఆర్థిక,
వ్యూహాత్మక అడుగులు
హెచ్పీసీఎల్ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ.26,264 కోట్ల నుంచి రూ.31 వేల కోట్ల వరకూ భారీ పెట్టుబడి పెట్టింది. 2018లో పనులు ప్రారంభమై, ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకుంది. ఇందులో ఆర్యూఎఫ్ ఏర్పాటు చేయడం వల్ల రిఫైనరీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రతి బ్యారెల్ ముడి చమురుపై వచ్చే లాభం పెరుగుతుందని హెచ్పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా డీజిల్ ఉత్పత్తి పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు సల్ఫర్ తక్కువగా ఉండే బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
మల్కాపురం: దేశానికే తలమానికంగా నిలుస్తున్న హెచ్పీసీఎల్(విశాఖ రిఫైనరీ)లో విస్తరణ పనుల భాగంగా నిర్మించిన అత్యాధునిక రఫ్ (రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ) యూనిట్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. సంస్థ ఉన్నతాధికారులు ఈ యూనిట్ను ప్రారంభించి, పనితీరును పరిశీలించారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న విస్తరణ పనుల్లో ఈ యూనిట్ నిర్మాణం కీలకం.
యూనిట్ను పరిశీలించిన ఉన్నతాధికారులు


