
ఆర్పీఎఫ్ ఎస్ఐకి ఇండియన్ పోలీస్ మెడల్
అనంతగిరి: వికారాబాద్లోని ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ జాలా సుధాకర్ ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. గుజరాత్లోని వలసాద్లో జరిగిన ఆర్పీఎఫ్ రైజింగ్ డే సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులతో పాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: తాండూరు మార్కెట్ యార్డులో దడువాయిగా పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. అర్హులైన 9 మందికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. 35 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. దరఖాస్తు తోపాటు విద్యార్హత, మెడికల్ ఫిట్నెస్, వయసు నిర్దారణ సర్టిఫికెట్లు జత చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం సెల్ నంబర్ 7330733618లో సంప్రదించాలని సూచించారు.
గోవులను రక్షించుకుందాం
ఇబ్రహీంపట్నం: గో సంతతిని కాపాడుకోవాలని, గోవులను రక్షించుకుంటేనే ప్రకృతి పరంగా జీవరాసులన్నింటికీ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ ప్రాంత గో సేవా ప్రముఖ్ వెంకట నివాస్జీ అన్నారు. జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలను మంగళవారం ఇబ్రహీంపట్నంలోని త్రిశక్తి అలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంతతి పెరిగితేనే భూసారం పెరుగుతుందని తెలిపారు. గోవుల పాల ఉత్పత్తులతోపాటు గో ఆధారిత వ్యవసాయం చేస్తే మనమంతా ఉండగలుగుతామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా, 80 కోట్లకు పైగా పశు సంతతి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం 20 కోట్ల పశువులు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంతతిని పెంపొందించుకునేందుకు, వాటిని రక్షించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విభాగ్, జిల్లా గో సేవా ప్రముఖులు వేణుగోపాల్, రచమళ్ల అబ్బయ్య, సుధాకర్రెడ్డి, బుగ్గవరపు రమేష్ పాల్గొన్నారు.
నిందితులను
కఠినంగా శిక్షించాలి
ఇబ్రహీంపట్నం: సీజేఐ గవాయ్పై దాడి అంటే రాజ్యాంగం, పార్లమెంట్, దేశం మొత్తంపై జరిగిన దాడిగా చూడాల్సిందేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీజేఐపై దాడిని నిరసిస్తూ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్ అధ్యక్షతన మంగళవారం ఇబ్రహీంపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సామెల్తోపాటు కార్యదర్శి ప్రకాశ్ కారత్, బీఎస్పీ నాయకుడు కొండ్రు రఘుపతి, తెలంగాణ ఉద్యమకారులు బోసుపల్లి వీరేష్కుమార్, రాములు, మారయ్య, పూసల సంఘం రాష్ట్ర నాయకుడు పురుషోత్తం, రజక సంఘం నాయకుడు ముదిగొండ అజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి చేసిన.. దాని వెనుకల ఉన్న నిందితులను కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. సమావేశంలో వెంకటేశ్, బండి సత్తయ్య, కాలె గణేశ్, కాళ్ల జంగయ్య, ఎం.రాజు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు అసైన్డ్ భూములపై సమావేశం
యాచారం: మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 19, 68, 127లోని అసైన్డ్, ప్రభుత్వ భూములపై గ్రామ రైతులతో బుధవారం సమావేశం ఉంటుందని తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల కు జరిగే సమావేశానికి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి హాజరవుతారని చెప్పారు. నోటిఫికేషన్ వేసిన 820 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి ఏం చేయాలనే విషయమై చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు.

ఆర్పీఎఫ్ ఎస్ఐకి ఇండియన్ పోలీస్ మెడల్