
నేడు లగచర్లలో రెవెన్యూ సదస్సు
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ భూ సమస్యల పరిష్కారానికి ఈ రెవన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తోందన్నారు. రైతులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఘనంగా కేంద్ర మంత్రి
జన్మదిన వేడుకలు
అనంతగిరి: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జన్మదిన వేడుకలు వికారాబాద్లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. కిషన్రెడ్డి విద్యార్థినేత నుంచి నేడు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. పార్టీలో క్రమశిక్షణగల నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా అహర్నిషలు ప్రజలకోసం పరితపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సదానందరెడ్డి, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి, మోహన్రెడ్డి, రాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీని కలిసిన
బీసీ సంఘం నేతలు
అనంతగిరి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.
ఆపరేషన్ కగార్ వెనుక కుట్ర
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహ్మద్
పరిగి: కేంద్రం మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్ కగార్ వెనుక కుట్ర కోణం దాగి ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీర్ మహ్మద్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అటవీ సందపను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నా కావాలనే వరుస దాడులు కొనసాగిస్తోందన్నారు. ఆపరేసన్ కగార్కు వ్యతిరేకంగా ఈ నెల 17న నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
పేదలను ఇబ్బంది పెట్టొద్దు
మాజీ మంత్రి సబితారెడ్డి
హుడాకాంప్లెక్స్: రాజకీయాల కోసం పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హితవు పలికారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు తమ సమస్యలను ఆదివారం ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలోని పేదలకు దాదాపు 5వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఆన్లైన్ లక్కీడీప్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లకు చెందిన 1,800 మందికి డ్రా ద్వారా కేటాయించామన్నారు. స్థానికులకు 10 శాతం కేటాయించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులకు పట్టాలు ఇచ్చామని వివరించారు. కొంతమంది కావాలని కోర్టులకు వెళ్లి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులతో చర్చించి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

నేడు లగచర్లలో రెవెన్యూ సదస్సు