
బోనస్ సున్నా
సన్నాలకు
పరిగి: వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు సన్నాలు సాగు చేపట్టి ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ధాన్యం విక్రయించి నెల రోజులు కావస్తున్న బోనస్ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 7,500 మెట్రిక్ టన్నుల సన్నాలకు గాను రూ.3.75కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు జమ చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఆలస్యమైనా అక్కడే విక్రయం
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తూకం వేయడంలో ఆలస్యం చేస్తున్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే కారణంగా రైతులు ఆలస్యమైనా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. మే మొదటి వారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించినా చెల్లింపుల్లో ఆలస్యంగా అవుతున్నాయి. సన్న రకం విక్రయించిన రైతులకు ముందుగా క్వింటాల్కు రూ.2,320 చొప్పున చెల్లించి తరువాత బోనస్ వేస్తున్నారు. బోనస్ మినహా మిగత డబ్బులు చాలా మంది రైతుల ఖాతాలో జమ అయ్యాయి.
పెరిగిన సాగు
జిల్లా వ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్లో రైతులు దొడ్డురకంతో పాటు సన్నాలు సైతం ఎక్కువగానే సాగు చేశారు. వానాకాలం సీజన్లో సాగు చేసిన సన్నాలకు బోనస్ డబ్బులను ప్రభుత్వం ఆలస్యంగా వేసిందని అప్పట్లో అధికారులు మొదటి సీజన్ కావున కొంత ఆలస్యం అవుతాయని చెప్పారు. యాసంగిలో బోనస్ను త్వరగా అందిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్ డబ్బులు ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నెల రోజులు దాటినా జమకాని రూ.500 ప్రోత్సాహకం
రైతులకు తప్పని ఎదురుచూపులు
నెల రోజులైంది
ఐదెకరాల్లో సన్న రకం వరిసాగు చేయగా 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల క్రితం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించా. బోనస్ డబ్బులు రూ.32 వేలు రావాల్సి ఉంది. నేటికీ జమ చేయలేదు. ప్రభుత్వం బోనస్ జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
– మేకల శ్రీనివాస్, ఐనాపూర్
ప్రభుత్వానికి నివేదించాం
ఇప్పటి వరకు 7,500 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను రెండు రోజుల వ్యవధిలోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలోనే రైతుల ఖాతాలో జమ అవుతాయి.
– మోహన్ కృష్ణ, పౌరసరఫరాల శాఖ డీఎం, వికారాబాద్

బోనస్ సున్నా