
ధరణి పోర్టల్తో దగా
పరిగి: గత ప్రభుత్వం దొరలు, భూస్వాముల మేలు కోసం ధరణి పోర్టల్ను తెచ్చిందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్జైన్ ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన ధరణి ఎన్నో సమస్యలకు కారణమైందన్నారు. నేటికీ ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో భూ సమస్యలు ఉన్నాయన్నారు. భూ భారతి చట్టంతో వాటన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కొత్త చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతితో భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు సులభతరం అవుతాయన్నారు. జూన్ 2నుంచి ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని వివరించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందన నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజూ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ చట్టం తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్టీఓ వాసుచంద్ర, తహసీల్దార్ ఆనంద్రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతితో పేదలకు న్యాయం
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి