సాక్షి, టాస్క్ఫోర్స్: నాగలాపురంలోని టీటీడీ ఆధీనంలో ఉన్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఓ టీడీపీ నేత తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కలకలం రేగింది. వివరాలు.. సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి దేవాలయ బోర్డు సభ్యుడు, టీడీపీ నేత నెల్సన్ మండేలా గురువారం తన పుట్టినరోజు వేడుకలను వేదనారాయణ స్వామి ఆలయ ప్రాంగణలో నిర్వహించాడు. నెల్సన్ మండేలా అనుచరులు, స్నేహితులు అతనికి శాలువ కప్పడం, బొకేలు ఇవ్వడం, పరస్పరం ప్రమాణాలు చేసుకోవడం, ఇది కాకుండా ఆలయ నియమాలకు విరుద్ధంగా, భంగం కలిగించేలా రూ.100 నోట్లను గాల్లో చల్లుకోవడం వంటి దృశ్యాలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యా యి. టీటీడీ ఆధీనంలోని ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన భక్తులు మనోభావాలు దెబ్బతీసిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘించిన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానిక డిమాండ్ చేశారు.


