రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ డ్రామాలు ఆడితే ప్రజలు, నిరుద్యోగులు, యువత నమ్మే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దమ్ముధైర్యం ఉంటే చెప్పిన తేదీలోపు డ్రామాలు ఆడకుండా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమ ప్రభుత్వంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలు తమపై కోపంతో పీకేశారని చెప్పారు. ప్రతిపక్షనాయకులను ఎదుర్కోలేక సుమారు 30 వేల మంది ఉద్యోగుల కడుపు కొట్టారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో యువకులకు తమ హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే తమపై కోపంతో వారికి ఉద్యోగాలు పీకేసి, వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగులుతుందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అలివికానీ హామీలిచ్చి అధికారం చేపట్టాక వాటిని తుంగలో తొక్కడం, నక్కజిత్తుల మాటలు చేప్పడం మామూలేనన్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెట్పీటీసీ సభ్యురాలు రత్నమ్మ, నాయకులు చెవు శ్రీనివాసులురెడ్డి, మందల నాగేంద్ర, నందబాల, సుబ్బరామరాజు, డీవీరమణ, మలిశెట్టి వెంకటరమణ, బండారు మల్లికార్జున, కస్తూరి రామకృష్ణ, పర్వతం విజయ్కుమార్రెడ్డి, శ్రీరాంవినోద్, గని, దామర్ల సిద్ధయ్య పాల్గొన్నారు.


