
ఇటు కోతలు.. అటు దాడులు!
నేలరాలుతున్న మామిడి
సీజన్ ఆఖర్లోనైనా ధరలు పలుకుతాయేమోనని చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలేశారు. మాగిన కాయలు రాలి నేలపాలవుతున్నాయి. ఎంత ధర దక్కినా అమ్ముదామునుకొని కాయలు దింపిన రైతులు గుజ్జు ఫ్యాక్టరీల వద్దకెళితే టోకెన్లు దొరకడం లేదు. ఫ్యాక్టరీల వద్ద బండ్లు పెట్టుకొని వేచి చూడాల్సి వస్తోంది. దీంతో కొందరు రైతులు మార్కెట్కు తీసుకెళ్లిన మామిడి కాయలను చేలల్లో పారబోసి వచ్చేస్తున్నారు. మరికొందరు తోటల్లో కాయలు కోయకుండానే వదిలిపెట్టేస్తున్నారు. టమాటాలకంటే తోతాపురి మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సకాలంలో అన్లోడ్ చేసుకోక ట్రాక్టర్ల ట్రక్కుల్లోనే కాయలు కుళ్లిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు కాయలను తోటల్లోనే వదిలేయడంతో అవి మాగి వాసన వెదజల్లుతున్నాయి. ఇదే అదునుగా ఏనుగుల మంద తోటలపై పడి ఉన్న కాయలను ఊడ్చేస్తుండడంతో మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది.
పలమనేరు: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఏడాది మామిడి నట్టేన ముంచేసింది. తోతాపురి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. వీటికి ధరల్లేక గుజ్జు పరిశ్రమల్లో టోకెన్లు చిక్కక, స్థానిక మండీల్లో అడిగేవారు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారులేమో తోటల్లోని కాయలను పలు దఫాలుగా కోయాలని ఆంక్షలు పెడుతున్నారు. మరోవైపు తోటల్లోనే కాయలు మాగి నేలరాలుతున్నాయి. మాగిన మామిడి వాసనతో కౌండిన్య అడవిలోంచి ఏనుగుల గుంపు మామిడి తోటలపై పడి కాయలను ఆరగిస్తున్నాయి.
నాలుగు నియోజకవర్గాల్లో మరీ ఘోరం...
జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడితోటలున్నాయి. ఏటా ఈ సీజన్లో 7 లక్షల టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. ఇందులో 45 వేల ఎకరాల్లో తోతాపురి రకమే ఉంది. మూడున్నర లక్షల టన్నుల దాకా తోతాపురి దిగుబడి ఉంటుంది. కాగా ఏనుగుల సంచారం ఉన్న పలమనేరు, కుప్పం, పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 40వేల ఎకరాల్లో మామిడి ఉండగా.. ఇందులో 22వేల ఎకరాలు తోతాపురి రకంగా ఉంది. వీటికి ధరల్లేక రైతులు తోటల్లోనే మామిడిని వదిలేశారు. ఇదే అదునుగా ఏనుగులు మామిడి తోటలనే టార్గెట్ చేస్తున్నాయి. పలమనేరు, బంగారుపాళెం, పెద్దపంజాణి, గంగవరం, సోమల, గుడిపాల తదితర మండలాలు కౌండిన్య అడవికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా రెండు విధాలుగా మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
లోకల్ ర్యాంపుల్లో మొదలుకాని వ్యాపారం
తోతాపురికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోనే ఏటా వ్యాపారులు ర్యాంపులు పెట్టి సరుకును కొనేవారు. దీంతో ఫ్యాక్టరీలకు వెళ్లే సరుకు తగ్గేది. ఈ దఫా ధరలు లేనందున బయటి వ్యాపారులు చాలా చోట్ల ర్యాంపుల వద్ద మామిడి కాయల వ్యాపారాలు మొదలు పెట్టలేదు.
పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డిపల్లి వద్ద ఏనుగులు ద్వంసం చేసిన మామిడి పంట
బంగారుపాళెం సమీపంలో మామిడిని చేలలో పడేస్తున్న దృశ్యం
ఏనుగులు తినేస్తున్నాయి
మాకు 2.5 ఎకరాల్లో మామిడితోట ఉంది. ఈ మధ్య రెండు సార్లు ఏనుగుల మంద తోటపై పడి కాయలను తిని, కొమ్మలను విరిచేశాయి. పోనీ కాయలు దించి అమ్ముదామంటే కిలో రూ.3 కూడా కొనేవారు లేరు. సంతవ్సరానికోపంట.. దీన్ని నమ్ముకుని బతికేటోళ్లం. అందుకే మామిడితోటే వద్దనుకుంటున్నాం. – నాగరత్మమ్మ, తిప్పిరెడ్డిపల్లి
భారీగా నష్టపోయాం
ఈ దఫా మామిడితోటలుకొని లక్షల్లో నష్టపోయాం. తోటకు కొట్టిన మందుల ఖ ర్చు, తోటమాలి డబ్బు కూడా మిగల్లేదు. పలమనేరులో ర్యాంపు లేదు. బంగారుపాళెంకు పోవాలంటే టన్నుకు ట్రాక్టర్ బాడుగ, కూలీలకే రూ.2,500 అవుతోంది. అక్కడ టన్నుకు దక్కేది రూ.3 వేలు. మాకు మిగిలేది రూ.500. – నయాజ్,
మామిడితోటల కొనుగోలుదారు, పలమనేరు
పలు దఫాలుగా కోతలు కోయాలి
రైతులు తోటల్లోని కాయల ను మాగినవి మాత్రమే పలు దఫాలుగా కోయాలి. అప్పుడు సీజన్ ఆఖర్ దాకా కోతలుంటాయి. ఒకేసారి కాయలన్నీ దించేసి వాటిని అమ్ముకోలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంకా ర్యాంపులు ప్రారంభం కానిచోట్ల ర్యాంపులు ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నాం.
– మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి

ఇటు కోతలు.. అటు దాడులు!

ఇటు కోతలు.. అటు దాడులు!

ఇటు కోతలు.. అటు దాడులు!