
చెవిరెడ్డిపై కక్ష సాధింపు
తిరుపతి రూరల్ : ‘ఆపదంటే ఒక్క క్షణం ఆలోచించడు.. అది మా ఊరైనా.. ఏ ఊరైనా.. కష్టంలో ఉంటే కాదనకుండా సాయం చేస్తాడు.. దేవుడంటే భక్తి.. పదవి ఇచ్చిన ప్రజలంటే భయం.. అలాంటి వ్యక్తి తప్పు చేశాడంటే ఎవరు నమ్ముతారు.. కుట్ర రాజకీయాలతో చెవిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు.. అంటూ తుమ్మలగుంటకు చెందిన పలువురు మహిళలు కూటమి ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం చెవిరెడ్డి పేరిట సామూహిక అర్చనలు చేశారు. చెవిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదని, జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మీడియా ద్వారా తెలుసుకుని మదనపడుతున్న ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మికి ఓదార్పు కలిగించారు. చెవిరెడ్డి లక్ష్మి ఏకాంతంగా ఆ దేవుడి ముందు కూర్చుని తన భర్త ఆరోగ్యం బాగుండేలా చూడాలని, అందరికీ సాయం చేసిన తన భర్తకు ఈ కష్టం ఎందుకు పెట్టావు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ తరువాత ఆలయం వెలుపలకు వచ్చి గ్రామానికి చెందిన మహిళలతో కలసి ఆలయం ముందు 1,116 కొబ్బరికాయలు కొట్టి చెవిరెడ్డి ఆరోగ్యం బాగుచేయాలని ప్రార్థించారు. ఏ తప్పు చేయని చెవిరెడ్డిని జైలుకు పంపించిన దుర్మార్గులు భూస్థాపితమవుతారని ఆరోపించారు. చెవిరెడ్డి రాజకీయంగా ఎదగడానికి పది మందికి మంచి చేయాలని ఆలోచిస్తారే తప్ప కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఎప్పుడు చేయలేదన్నారు. తుమ్మలగుంట గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిదంటే అది ఒక్క చెవిరెడ్డి వల్లనే సాధ్యమైందని, ఆయనకి తమ గ్రామంపైన ఉన్న మక్కువ అలాంటిదన్నారు. ఈ గ్రామానికి ఆయన ఎంతో చేశారని, ఆయనకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చినందున గ్రామంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆయన చేసిన మంచిని చెప్పుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామం నుంచి సుమారు 100 మందికిపైగా మహిళలు ఆలయం వద్దకు వచ్చి చెవిరెడ్డి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని భరోసా కల్పించారు.
కల్యాణ వెంకన్నకు గ్రామస్తుల
సామూహిక అర్చనలు