
వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం
చంద్రగిరి : అదుపు తప్పి వాహనం బోల్తా పడిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిళ్లకుండా క్షేమంగా బయటపడిన ఘటన శనివారం తెల్లవారుజామున పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి అగరాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన కారు చిత్తూరు వైపు నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో అగరాల సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద అదుపు తప్పింది. దీంతో కారు జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువను ఢీకొట్టి, సర్వీ సు రోడ్డుపై బోల్తా పడి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో డ్రైవరు తప్ప ఎవరూ లేకపోవడంతో, డ్రైవరు సీటు బెల్టు పెట్టుకోవడంతో చిన్నపాటి గాయలయ్యాయి. అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. గాయపడిన క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ (ఎంటీఎస్, మినిమం టైం స్కేల్) టీచర్లకు ఆదివారం బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల సీనియారిటీ జాబితా సంబంధిత మండలాలకు పంపినట్లు చెప్పారు. ఆ జాబితా ప్రకారం ఆదివారం చిత్తూరులోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. 2008 ఎంటీఎస్ టీచర్లకు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
నేడు గురుకులాల్లో
సీట్ల కేటాయింపు
తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆదివారం సీట్లు కేటాయించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాలికలకు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు సమీపంలోని సంజయ్ గాంధీ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అలాగే బాలురకు చిత్తూరులోని వేము ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని పూతలపట్టు బాలుర గురుకుల పాఠశాలలో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి హాజరు కావాలని ఆమె కోరారు.