
మామిడి రైతులను ఆదుకుంటాం
పాకాల:మామిడి రైతులు నష్టపోకుండా ప్రభు త్వం వారికి అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం దామలచెరువులో జరిగిన మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. మామిడి రైతులకు గిట్టుబాటు ధర అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 3 ఫ్యాక్టరీలతో మామిడి రైతులు నష్టపోతున్నారని, రైతులకు నష్టం కలిగించే ఫ్యాక్టరీలపై మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
అధిక దిగుబడులతోనే ధరలు పతనం
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తోతాపురిని అత్యధికంగా 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగిందని, పంట దిగుబడి అధికం కావడంతో రేటు తగ్గిందని తెలిపారు. వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులు, సప్లైయర్స్ రైతుల నుంచి తోతాపురి మామిడిని రూ.8కు కొనుగోలు చెయ్యాలని, ప్రభుత్వం నుంచి సంబంధిత రైతుకు రూ.4 చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ శుభంబన్సల్, హార్టికల్చర్ స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆర్డీవో రామ్మోహన్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,096 మంది స్వామివారిని దర్శించుకోగా 36,262 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.