
● వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్
సాక్షి, టాస్క్ఫోర్స్ : టీడీపీ నేతలు హిందూత్వంపై దాడి చేయడం దారుణమని, ఆలయాల రక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి స్పష్టం చేశారు. దామినేడులో టీడీపీ నేతలు ధ్వంసం చేసిన నాగాలమ్మ ఆలయాన్ని పరిశీలించారు. ఆదివారం ఈ మేర కు ఆయన మాట్లాడుతూ నాగాలమ్మ పుట్టను తొలగించడం, శూలాలను ఽమాయం చేయడం, ఆలయ ఆనవాళ్లు లేకుండా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న నాగాలమ్మకు అపచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతల అకృత్యాలపై స్పందించకుండా ఎమ్మెల్యే మౌనంగా ఉండడం దుర్మార్గమని విమర్శించారు. నాగాలమ్మ ఆలయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమిస్తామని తెలిపారు. దామినేడు వాసులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆర్డీఓ కార్యాలయంలో చర్చలు
నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై దామినేడు వాసులు శనివారం తిరుచానూరు పోలీసులతోపాటు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు నేతృత్వంలోనే ఆలయం కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో దామినేడు గ్రామస్తులు, టీడీపీ నేత కృష్ణమూర్తినాయుడుతో సుమారు 4 గంటలపాటు ఆర్డీఓ రామ్మోహన్ చర్చించారు. ఆలయ కూల్చివేతపై స్థానికులు మండిపడినట్లు తెలిసింది. పొంతన లేకుండా సమాధానాలిస్తున్న కృష్ణమూర్తినాయుడిని నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలో జూలై 31వ తేదీలోపు నాగాలమ్మ ఆలయాన్ని పునర్నించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి కృష్ణమూర్తి నాయుడు సైతం అంగీకరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా దామినేడులోని సర్వే నంబర్ 191 నుంచి 194లో ఉన్న నాలుగు ఎకరాల ఆక్రమణపై ఆర్డీఓకు స్థానికులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే ముందుగా ఆలయ విషయం మాత్రమే విచారణ చేస్తామని, ఆక్రమణపై మరోసారి మాట్లాడుదామని ఆర్డీఓ చెప్పినట్లు తెలిసింది.

● వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్