
ఆనాటి.. ఆ స్నేహమానందగీతం!
శ్రీకాళహస్తి : స్నేహమాధుర్యం మళ్లీ వారిని బడిఈడు పిల్లలుగా మార్చేసింది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆనాటి స్నేహం ఆనంద గీతమై ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ మధుర స్మృతులను గుర్తుచేసింది. దాదాపు 31 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1994 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం స్థానిక కై కాల సత్రంలో కలుసుకున్నారు. బాధలు తెలియని నవ్వులు, మౌనం తెలియని మాటలు, కల్మషమెరుగని ప్రేమలు, కష్టం ఎరుగని క్షణాలతో గడిపిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుని మురిసిపోయారు. చదువులమ్మ ఒడిలో చేసిన అల్లరిని నెమరువేసుకున్నారు. మనసులో మరపురాని బాల్యపు పుటలను తిరగవేసి ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఇకపై అందరూ టచ్లో ఉండాలంటూ ఫోన్న్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. స్నేహితులకు తమ కుటుంబసభ్యులను పరిచయం చేసుకున్నారు. అపూర్వ సమ్మేళానికి గుర్తుగా ఫొటోలు తీసుకుని భద్రపరుచుకున్నారు. అనంతరం తాము విద్యను అభ్యసించిన పాఠశాలకు వెళ్లి ఆయా సెక్షన్లలో కూర్చొని పరవశించారు. కార్యక్రమ నిర్వహణకు పూర్వ విద్యార్థులు హరి, మునస్వామి, నాదముని, త్రిమూర్తి, జ్ఞానశేఖర్, హేమకుమార్, కేశవన్, నాగేంద్ర కుమార్ మహేష్, ఫాజిల్ తదితరులు పర్యవేక్షించారు. మొత్తం 150 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబాలతో తరలివచ్చి విజయవంతం చేశారు.
31 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం
భావోద్వేగానికి గురైన మిత్ర బృందం