
కేజీబీవీల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న సీట్లకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష ఎక్స్ అఫిషియో కో–ఆర్డినేటర్, డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. కేజీబీవీల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 6, 11 తరగతుల్లో కొత్తగా ప్రవేశం పొందేందుకు, అలాగే 7, 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు), పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్రరేఖకు దిగువ ఉన్న విద్యార్థులే అర్హులని, ఆన్లైన్ దరఖాస్తులనే అడ్మిషన్లకు పరిగణించబడతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11వ తేదీలోపు ‘ఏపీకేజీబీవీ.ఏపిసీఎఫ్ఎస్ఎస్.ఇన్’’ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు వారి ఫోన్ నంబరుకు సమాచారం అందుతుందని తెలిపారు. వివరాలకు 70751 59996, 70750 39990 నంబర్లలో సంప్రదించాలని డీఈఓ కోరారు.
ఇంగ్లిష్ పరీక్షకు
413 మంది గైర్హాజరు
తిరుపతి అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 26,840 మంది రెగ్యులర్ విద్యార్థులు, 57 మంది ప్రైవేటు విద్యార్థులు, ఓపెన్ స్కూల్స్కు సంబంధించి 966 మంది హాజరవ్వాల్సి ఉందన్నారు. అయితే ఇందులో 413 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు వెల్లడించారు.
ఒక విద్యార్థి డిబార్
సత్యవేడు మండలంలోని ఏపీఎస్డబ్ల్యూ బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఓ విద్యార్థి కొన్ని కాగితాలతో ఉన్నట్టు ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో గుర్తించారని డీఈఓ తెలిపారు. దీంతో ఆ విద్యార్థిని డిబార్ చేయడంతోపాటు ఆ గదిలోని ఇన్విజిలేటర్ ఎస్.వెంకటేశ్వరరావు(ఎంపీపీఎస్ యన్టీ స్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు, సత్యవేడు మండలం)ను సస్పెండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
డీఎస్పీ సుకుమారికి ఉత్తమ సేవా పతకం
చంద్రగిరి: కల్యాణీ డ్యాం సమీపంలోని పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీ సుకుమారికి ఉత్తమ సేవా పతకం, ఆర్ఎస్ఐ ఆనంద నాయుడు సేవా పతకానికి ఎంపికై నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చేతుల మీదుగా పతకాలు అందించి సత్కరించనుంది. ఈ మేరకు శుక్రవారం పీటీసీలోని పలువురు సిబ్బంది వారిని అభినందించి, సత్కరించారు. గతంలోనూ డీఎస్పీ సుకుమారి అనేక అవార్డులు, రివార్డులను అందుకున్నారు.
24న డీసీ కార్యాలయాల వద్ద ఆందోళన
తిరుపతి అర్బన్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 24న తిరుపతి, చిత్తూరు జిల్లాల సమన్వకర్తల కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయనునట్టు ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షరాలు లత, కార్యదర్శి ఉషారాణి వెల్లడించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఈనెల 27న చలో మంగళగిరి వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బంది సర్వీస్ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
27న స్థానిక సంస్థల ఉప ఎన్నిక
తిరుపతి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఖాళీ అయిన చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి రూరల్ ఎంపీపీతోపాటు రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి, చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లి, కోట మండలంలోని ఎన్పీ కొత్తపాళెం, ఎర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీల ఉప సర్పంచ్లకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.