
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియా పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసి.. చివరకు ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. భర్త, పిల్లలను విడిచిపెట్టి ప్రియుడిని వివాహం చేసుకున్న మహిళ.. చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను పెళ్లాడిన వ్యక్తి విషం తాగి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సోషల్ మీడియా ఇన్స్స్టాగ్రామ్లో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు ఎంత వరకు వెళ్లిదంటే.. పద్మకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం ప్రియుడే కావాలనుకుంది. ఈ క్రమంలో భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో ప్రియుడిని వివాహం చేసుకుంది. గత 9 నెలలుగా సురేశ్తో కాపురం చేస్తోంది.
అయితే, వీరద్దరి మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం మరోసారి ీవీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టిఫిన్, భోజనాన్ని వృథా చేస్తోందని పద్మను సురేశ్ మందలించడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతో శవాన్ని కిందకు దించి సురేశ్ భయాందోళనకు లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక.. అతను కూడా విషం తాగాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సురేశ్, చివరకు ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక, సోషల్ మీడియాలో మొదలైన పరిచయం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటనగా మారింది. అటు ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.