
చిత్తూరులో పంపిణీకి సిద్ధంగా ట్రాక్టర్లు
ఆధునికంగా
● రాయితీపై రైతులకు వ్యవసాయ పరికరాలు ● వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద పంపిణీ ● పండుగలా జిల్లాస్థాయి కార్యక్రమం ● మంత్రి పెద్దిరెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులకు ట్రాక్టర్లు ● సేద్యానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా
సబ్సిడీ నగదు చెక్కును రైతులకు అందిస్తున్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి
జెండా ఊపి ట్రాక్టర్ల పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి, కలెక్టర్
సాక్షి, చిత్తూరు : వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్ల పంపిణీ మెగా మేళా –2 ను ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి చేతులమీదుగా మొత్తం 237 గ్రూపులకు రూ.4.17 కోట్ల రాయితీతో 111 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు కల్పించడమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన ఘనతం ముఖ్యమంత్రికే దక్కుతుందని కొనియాడారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను రెండు నెలల్లో పూర్తి చేసి ఆ ప్రాంతంలోని అన్ని చెరువులను నీటితో నింపుతామని భరోసా ఇచ్చారు. పడమటి ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు మూడు రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, వాటిలో 22 లక్షల గృహ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. చిత్తూరు కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా గ్రూపుగా ఏర్పటిన రైతులకు రాయితీపై ట్రాక్టర్లు పంపిణీ చేశామన్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న పాలనతో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప మాట్లాడుతూ రైతులపై మమకారంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నారని, సాగును సంబరంగా మార్చేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేశారని వివరించారు. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రైతులకు రాయితీ పై ట్రాక్టర్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ మాట్లాడుతూ రైత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ మురళి, చిత్తూరు నగర మేయర్ అముద, జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఐసీడీఎస్ జోనల్ చైర్మన్ శైలజారెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకట్రెడ్డియాదవ్, జెడ్పీ మహిళా స్థాయీ సంఘం చైర్మన్ భారతి, డీఆర్ఓ రాజశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ రేణుక పాల్గొన్నారు.
సేద్యం.. సులభం
తిరుపతి అర్బన్ : ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోరారు.శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లో వైఎస్సార్ యంత్రసేవా పథకం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు చేతులమీదుగా రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ యంత్రసేవ కింద రైతులకు ట్రాక్టర్లతోపాటు హార్వెస్టర్లు, నాగళ్లు, స్ప్రేయర్లు తదితర 42 రకాల పరికరాలను అందజేస్తున్నామన్నారు. వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు తగ్గించడానికి ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి నిధి కింద ఏటా విడతల వారీగా రూ.13,500 అందిస్తున్నామని తెలిపారు. సేద్యాన్ని సులభంగా మార్చేందుకు ఆధునిక పరికరాలను సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద విడతల వారీగా ట్రాక్టర్లు, వరికోత యంత్రాలతోపాటు పలురకాల పనిముట్లు అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో బీడు భూములు సైతం సాగులోకి వస్తున్నాయని వివరించారు. మోహిత్రెడ్డి మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా రైతులు గ్రూపుగా ఏర్పడి కేవలం పరికరం విలువలో పదిశాతం చెల్లిస్తే 40శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తుందని, 50శాతం బ్యాంకు రుణం మంజూరు చేయిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లప్పుడూ అన్నదాతలకు అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు మాట్లాడుతూ మొత్తం 445 ఆర్బీకేలకు గాను 429 కేంద్రాల్లో వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మెగా మేళా రెండో విడతలో భాగంగా 160 గ్రూపులకు రూ.13.69 కోట్ల విలువైన పనిముట్లను రూ.4.58 కోట్ల సబ్సిడీపై అందజేస్తున్నట్లు చెప్పారు. గతంలో 180 ట్రాక్టర్లు పంపిణీ చేశామని, ఇప్పుడు మరో 74 ట్రాక్టర్లు అందిస్తున్నట్లు వివరించారు. కలెక్టరేట్ ఏడీ ధనంజయరెడ్డి, శ్రీకాళహస్తి ఏడీ రమేష్రెడ్డి, తిరుపతి ఏడీ మనోహర్, సత్యవేడు ఏడీ సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ గాయత్రి, శ్రీకాళహస్తి ఏఓ సుధాకర్రెడ్డి, తొట్టంబేడు ఏఓ సురేంద్ర పాల్గొన్నారు

తిరుపతిలో రైతులకు పంపిణీ చేసిన ట్రాక్టర్లు