మంత్రివర్గ సమావేశం అజెండాలో పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: రేపు మంగళవారం జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఎన్నో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ కొనసాగింపు.. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ముఖ్యమైన అంశం వేతన సవరింపు సంఘం (పీఆర్సీ) కూడా అజెండాలో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు పీఆర్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు పీఆర్సీ అంశం చర్చకు రానుంది. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. ఇప్పటికే వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఫిట్మెంట్, ఇతర అంశాలపై ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.