
అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.
ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, బలవంతంగా తొలగించే కార్యక్రమం చేపట్టాలని స్పష్టంచేశారు. అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు.
దీనిపై కన్సల్టెంట్ సంస్థ ఇచి్చన నివేదికపై ఆయన చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.