దసరా: అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు

South Central Railway CPRO Says 900 Additional Special Trains Dussehra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా సందర్భంగా అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు స్టేషన్లలోకి అనుమతించడం లేదని, రిజర్వేషన్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. పండుగ సమీపిస్తున్న తరుణంలో సోమవారం ‘సాక్షి’తో మాట్లాడిన సీపీఆర్వో రాకేష్ పలు విషయాలు వెల్లడించారు. స్టేషన్‌లో ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు.

అదే విధంగా, రైల్వే స్టేషన్‌లో బుకింగ్‌ సదుపాయం ఉందని, ఆన్‌లైన్‌ ద్వారా కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వడం లేదన్న ఆయన, భోజనం కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటే మంచిదని సూచించారు. అయితే క్యాటరింగ్‌ ఫుడ్‌ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకులంతా తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, స్టేషన్‌లో నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top