స్లీపర్‌తో శాశ్వత నిద్రే | sleeper bus accidents rising safety concerns india | Sakshi
Sakshi News home page

స్లీపర్‌తో శాశ్వత నిద్రే

Apr 20 2026 1:40 PM | Updated on Apr 20 2026 1:45 PM

sleeper bus accidents rising safety concerns india

సాక్షి,హైదరాబాద్‌: వరుస ప్రమాదాలతో స్లీపర్‌ బస్సులు ఠారెత్తిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ బస్సుల అనుమతిపై ఆర్టీఏ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు, ముంబై, షిరిడీ, చెన్నై, బెంగళూర్‌ తదితర ప్రాంతాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. స్లీపర్‌ బస్సుల్లో మంటలంటుకొని పదుల సంఖ్యలో ప్రయాణికులు విగతజీవులైన ఘటనలు గతంలో జరిగాయి. ఇటీవల కేపీహెచ్‌బీలోనూ స్లీపర్‌ బస్సులో మంటలంటుకున్నాయి. అదృష్టవశాత్తు డ్రైవర్‌  ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో ముప్పు తప్పింది. అంతకుముందు మియాపూర్‌ నుంచి బయలుదేరిన మరో  బస్సు సైతం ఏపీలోని కర్నూలు వద్ద  ఇలాగే  ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ.. స్లీపర్‌  బస్సులతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.   

అడ్డగోలుగా అనుమతులు.. 
కొంతకాలంగా ప్రైవేట్‌ బస్సులు నాగాలాండ్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో నమోదై హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్న పర్మిట్‌ రుసుములను తప్పించుకొనేందుకు నాగాలాండ్‌ వంటి ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. అడ్డగోలుగా అనుమతులు పొంది హైదరాబాద్‌లో రోడ్డెక్కిస్తున్నారు. నగరం నుంచి విజయవాడ, ఏలూరు, గుంటూరు, కాకినాడ, విశాఖ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 1,100కు పైగా ప్రైవేట్‌ బస్సులు హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్నట్లు అంచనా. వీటిలో 40 శాతం వరకు స్లీపర్‌ బస్సులే ఉన్నాయి.  

ప్రమాద ఘంటికలు..
స్లీపర్‌ బస్సులు ఏ మాత్రం సురక్షితం కాదని ఇప్పటికి పలుమార్లు నిపుణులు సూచించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలోనూ ఆస్కీ ఇదే అంశాన్ని  సూచించింది  స్లీపర్‌ బెర్తులతో పాటు  అదనపు హంగులను ఏర్పాటు చేయడం, వివిధ రకాల అవసరాల కోసం ఎలక్ట్రిక్‌ వైర్లను వినియోగించడంతో ఎక్కడో ఒక చోట అవి తెగి షార్ట్‌సర్క్యూట్‌కు గురవుతున్నాయి. స్లీపర్‌ బెర్తులను తొలగించి ఫుష్‌బ్యాక్‌ సీట్లను  ఏర్పాటు చేయాలని, డ్రైవర్‌కు, ప్రయాణికులకు మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సీటింగ్‌ ఏర్పాటు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement