సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. జాతీయజెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్తూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్, డీజీపీ, మంత్రులు పాల్గొన్నారు.
గవర్నర్ ప్రసంగిస్తూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని.. అప్పటి నుంచి భారత్ ఒక గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఆ చారిత్రాత్మక క్షణం నుంచే రాజ్యాంగం దేశానికి మార్గ నిర్దేశం చేస్తోందన్న గవర్నర్.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలతో దేశాన్ని నడిపిస్తోందన్నారు.
‘‘గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదు... మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, సుసంపన్నమైన మన వైవిధ్యంలో ఐక్యతను సాధించాలనే మన గురుతర బాధ్యతను గుర్తు చేసే పవిత్ర దినం. ఇది భారత ఆత్మను ప్రతిబింబించే జాతీయ పండుగ.
..మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా పాలనను అందించడానికి ఇది మార్గ నిర్దేశం చేస్తుంది. ఈ పవిత్ర దినాన... న్యాయం, సమానత్వం, సోదరభావం వంటి విలువలను మరింత పరిరక్షించడానికి పునరంకితమవుతూ ముందుకు సాగాలి. ఇవే ఒక బలమైన దేశానికి మూల స్థంభాలు.
..సీఎం రేవంత్ నాయకత్వంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం.. గణనీయమైన విజయాలను సాధించి ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను సంపాదించింది. రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ అనే దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్మ్యాప్ను ప్రకటించింది.
..వికసిత్ భారత్’ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్య సాధనకే తెలంగాణ రైజింగ్ - 2047 దార్శనిక పత్రాన్ని రూపొందించింది. గత డిసెంబరులో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ ప్రతినిధుల మధ్య ప్రభుత్వం ఈ దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది’’ అని గవర్నర్ వివరించారు.
శాసనమండలిలో..
తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. జాతీయ జెండాను ఎగుర వేశారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వాణి దేవి, తక్కెళపెళ్ళి రవిందర్ రావు, అంజిరెడ్డి, మల్కాకొమురయ్య , శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో..
అసెంబ్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.



